జీవితం చాలా అందమైనది.. గెలిస్తేనే జీవితం.. లేకుంటే శూన్యం అనుకోవద్దు.. ఏ ఇబ్బంది కలిగినా ఆగిపోవద్దు.. ఓటమిని తలుచుకుంటూ కుంగిపోవద్దు.. వివిధ పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన అక్కడితో లైఫ్ ఆగిపోదు. పదో తరగతిలో ఫెయిల్ అయినందుకు ఓ విద్యార్థి.. టెట్లో అర్హత సాధించలేదని ఓ అభ్యర్థి.. ఉద్యోగం రాలేదని ఒకరు.. ఇంటర్వ్యూ ఫెయిలైనా అని మరొకరు.. ఇలా ప్రాణాలు తీసుకున్నారు. ఇటీవల ఈ ఘటనలు ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న గొప్పగొప్ప వ్యక్తులు కూడా ఎప్పుడో ఒకసారి, ఏదో ఒకదాంట్లో ఫెయిలైన వాళ్లే. అలా అని వాళ్లు నిరుత్సాహానికి గురైతే ప్రముఖ స్థానంలో ఉండేవాళ్లు కాదు. ఓటమి రేపటి గెలుపునకు నాందిగా భావించాలి. యువ కిరణాల జీవితం విషాదం కాకూడదు. విద్యార్థులు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కమాట జాగ్రత్తగా వినండి ఓటమి.. ఓ గెలుపు పాఠం.
– కొమురవెల్లి, జూలై 6
కొమురవెల్లి, జూలై 6 : ఇటీవల ఇంటర్, పదో తరగతి, టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష ఫలితాలు వరుసగా విడుదలవుతున్నాయి. ఫలితాలు కొంతమందికి తియ్యదనాన్ని.. మరికొందరికి చేదు జ్ఞాపకాలు మిగల్చడం సహజం. ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచినవారు కొందరైతే.. ఫెయిలైన వారు ఇంకొందరున్నారు. మరికొందరైతే పరీక్ష తప్పామన్న ఆవేదనతో క్షణికావేశానికి లోనవుతుంటారు. గతంలో పరీక్ష ఫలితాల ప్రభావంతో ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తాయి. పరీక్షల్లో ఫెయిలయ్యారని తల్లిదండ్రులు మందలించడంతో సైతం కొందరు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడే అవకాశం లేకపోలేదు.
తమ పిల్లలు అనుకున్న మార్కులు సాధించలేదనో, పాస్ కాలేదనో వారిని మందలించి వారిలో ఆత్మన్యూనతాభావాన్ని పెంపొందించవద్దు. ఎందుకంటే ఫెయిలైన బాధతో కుంగిపోయి ఉన్న వారి మనసును మరింత గాయపరిస్తే, తీవ్రమైన నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో పోల్చుతూ అవహేళనగా మాట్లాడితే వారి మనసు మరింత బాధకు గురవుతుంది. ఫలితాల సమయంలో పిల్లలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. ఫలితాలు అనుకూలంగా వస్తే ఫర్వాలేదు..ప్రతికూలంగా వస్తే వారు తీవ్ర నిరాశకు గురవుతుంటారు. అలాంటి సమయంలో వారిని అక్కున చేర్చుకోవాలి. ధైర్యాన్ని ఇవ్వాలి. జరిగిన పొరపాటు గురించి పిల్లలతో సున్నితంగా చర్చించి మేమున్నామన్న భరోసాను ఇవ్వగలిగితే వారి భవిష్యత్ ఇక తిరుగులేదు.
ఓటమిని నేరంగా భావించడం. గెలిచిన వాళ్లకే సమాజంలో చోటు ఉంటుందనుకోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ, ప్రతి ఓటమి విజయానికి నాంది. మరింత నేర్చుకోవడానికి అవకాశమిస్తుందని పిల్లలు గుర్తించేలా చేయాలి. అటు కుటుంబ వ్యవస్థ, ఇటు విద్యావ్యవస్థ విషయంలో అవగాహన కల్పించాలి. జీవితంలో గెలుపోటములు సర్వ సాధారణమైనవని అర్థం చేయించినప్పుడే మాత్రమే పిల్లలు ఓటమిని సాధారణ విషయంగా స్వీకరించగలుగుతారని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఫలితాలు ఎలా ఉన్నా.. కాసేపు ప్రశాంతంగా ఆలోచించుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి. అనవసరంగా ఆందోళనకు, ఒత్తిడికి గురై తప్పుడు దారులు వెతకవద్దని విద్యావేత్తలు చెబుతున్నారు. ఎందుకు ఒడిపోయాం, కారణమేమై ఉంటుందని మరోసారి స్మరణకు తెచ్చుకోవాలి. అలాంటి తప్పులు పునరావృత్తం కాకుండా ప్రయత్నం చేస్తే విజయం తప్పక వరిస్తుందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉత్తీర్ణత సంతోషాన్ని, బలాన్ని ఇస్తే.. ఓటమి విజయానికి బాటలు వేస్తుందన్న నిత్య సత్యాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. కష్టపడి చదవాలి. మంచి మార్కులు సాధించాలన్న లక్ష్యంతో దూసుకుపోవాలి. మన చిత్తశుద్ధిలో లోపం లేకుంటే ఫలితం ఎలా ఉన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గెలుపు, ఓటమి.. ఏదైనా సరే విద్యార్థులు సమానంగా స్వీకరించాలి.