సిద్దిపేట, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం 4గంటలకు సిద్దిపేటలోని మినీ స్టేడియంలో అట్ట్టహాసంగా టోర్నీ ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు మచ్చవేణుగోపాల్రెడ్డి, కలకుంట్ల మల్లికార్జున్ తెలిపారు. మంత్రి హరీశ్రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, సినీ నటుడు అక్కినేని అఖిల్, మాజీ క్రీడాకారుడు చాముండేశ్వరీనాథ్ హజరు కానున్నారని తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ టోర్నీలో 258 జట్లు, 4000వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. సిద్దిపేటలోని ఆచార్య జయశంకర్ స్టేడియంలో అట్టహాసంగా టోర్నీ ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కేక్కట్ చేయనున్నారు. అనంతరం టోర్నీ ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో విజేత జట్టకు రూ.లక్ష ప్రైజ్మనీతో పాటు విన్నర్ ట్రీఫీని అందజేయనున్నారు. రెండో స్థానంలో నిలిచిన జట్టకు రూ.50 వేలు ట్రోఫీ బహూకరిస్తారు. మ్యాన్ ఆఫ్ ధి సిరీస్గా నిలిచిన ఆటగాడికి రూ. 25వేలు, ట్రీఫీ అందించనున్నారు.ప్రతి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఆటగాడికి రూ.500, జ్ఞాపికను అందిస్తారు.
నాలుగు గ్రూప్లు.. 258 జట్లు…
ఈ టోర్నీలో మొత్తం 258 జట్లను 4 గ్రూప్లుగా విభజించారు. సిద్దిపేట పట్టణం జట్లు పూల్-ఏ, పూల్ బీలో పోటీపడుతుండగా, 5మండలాల జట్లు పూల్-సీ,పూల్-డీలో పోటీపడనున్నాయి. పూల్-ఏ,బీలో ఉన్న జట్ల మ్యాచ్లు నైట్ జరుగనున్నాయి, పూల్-సీ,డీలో ఉన్న జట్లు డే మ్యాచ్లు ఆడనున్నాయి. ్ర
కీడా పండుగకు వేళాయె అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేస్తడు..
సిద్దిపేట అర్బన్ : సీఎం కేసీఆర్ నేను ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు క్లాస్మేట్లం. ఒకే రూమ్లో ఉండి చదువుకున్నాం. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుకునేవాళ్లం. నేను పోస్టాఫీస్ ఉద్యోగిగా రిటైరయ్యాను. కేసీఆర్ ఎంత చురుకైన వ్యక్తి అంటే తను పాఠాలు విని మళ్లీ లెక్చరర్లకే బోధించేవాడు. ఒక్కసారి వింటే చాలు ఇట్టే గుర్తుంచుకొని పరీక్షలు రాసేవాడు. పుస్తకం లేకుండానే ఆశువుగా పాఠాలు చెప్పేవాడు. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేసేటోడు. మేము అప్పుడే గ్రహించినం ఏదో ఒకరోజు ప్రజలను పాలించేవాడవుతాడని. సీఎం అయిన తరువాత చాలాసార్లు కలిసిన. ఎప్పుడు పోయినా ఆప్యాయంగా మాట్లాడుతడు. ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగా లేక కలవలేకపోయిన. ఎప్పడు వచ్చినా మా ఇంట్లోనే ఉండేవాడు. చిన్నతనం నుంచి ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి మెదిలాం. ఆయన నిండునూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నా.
-భైరి కిష్టారెడ్డి, సీఎం కేసీఆర్ క్లాస్మేట్, చింతమడక
వంద కిలోల పసుపు బియ్యంతో సీఎం కేసీఆర్ చిత్రపటం..
గజ్వేల్ రూరల్,ఫిబ్రవరి16 ; సీఎం కె.చంద్రశేఖర్రావు 68వ పుట్టినరోజును పురస్కరించుకొని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం అధ్యక్షుడు రామకోటి రామరాజు 100 కిలోల పసుపు బియ్యం, 10కిలోల ఆవాలతో 17 అడుగుల భారీ కేసీఆర్ చిత్రపటాన్ని ఐదు రోజుల పాటు శ్రమించి వేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు బాంధవుడిగా పేరుగాంచిన సీఎం కేసీఆర్ చిత్రపటాన్ని రైతులు పండించిన బియ్యంతో వేయడంలో ఎంతో సంతృప్తి కలిగిందన్నారు. అర్చకుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అర్చకుల సంక్షేమానికి ఎంతగానో కృషిచేస్తున్నారు.అర్చకులను రెగ్యులరైజ్ చేశారు. అర్చకులకు ఉద్యోగులతో సమానంగా 2015, 2020 పీఆర్సీని వర్తింపజేశారు. ప్రతినెల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా వేతనాలు చెల్లిస్తున్నారు. చిన్న దేవాలయాలకు సైతం దూప దీప నైవేద్య పథకం వర్తింపజేశారు. బ్రాహ్మణ పరిషత్ను ఏర్పాటు చేశారు. అర్చకుల పక్షాన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
–కలకుంట్ల వెంకటనర్సింహా చార్యులు,దూప దీప నేవైద్య సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు