గుమ్మడిదల, మే28: అక్రమ కట్టడాలపై కొరడా ఝులిపిస్తామని డీఎల్పీవో సతీశ్రెడ్డి హెచ్చరించారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు సంగారెడ్డి డీఎల్పీవో సతీశ్రెడ్డి అక్రమ కట్టడాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్పంచ్ తిరుమలవాసు, ఉప సర్పంచ్ మురళి, జీపీ కార్యదర్శి వినోద్కుమార్తో కలిసి అపర్ణ, శిల్పా వెంచర్లను పరిశీలించారు. అపర్ణ వెంచర్లో గ్రామ పంచాయతీకి చెందిన రోడ్డు తొలగించడంపై విచారణ చేపట్టారు. ఈ రోడ్డు రెవెన్యూకు సంబంధించినదా? ప్రభుత్వ భూమికి చెందినదా? లేదా గ్రామ కఠంలోనిదా అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు నివేదించాల్సింది ఉంటుందన్నారు. వెంటనే సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కోరారు. శిల్పా వెంచర్ హెచ్ఎండీఏ అనుమతులతో చేశారని నిర్వాహకులు తెలుపగా, 29 ఎకరాలకు మాత్రమే లేఅవుట్ తీసుకున్నారని, మిగిలిన ఆరెకరాలు విస్తరించారని ఫిర్యాదు రావడంతో పూర్తి నివేదికను తమకు సమర్పించాలని ఆదేశించారు.
అనంతరం మోల్డ్టెక్, అనారో పరిశ్రమల విస్తరణ చట్టపరంగా సాగుతుందా లేదా అనే విషయాన్ని విచారించారు. ఈ విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని, ఆ పరిశ్రమ ప్రతినిధులను ఆదేశించారు. 261/3లో 5 ఎకరాల్లో వెలుస్తున్న వెంచర్ అనుమతులు లేకుండా లేఅవుట్ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఆ వెంచర్ లేఅవుట్, హెచ్ఎండీఏ అనుమతులు లేకుండా క్రయవిక్రయాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలో పూర్తి సమాచారంతో సరైన నివేదిక ఇవ్వాలని వెంచర్ నిర్వాహకులను ఆదేశించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తమకు వెంటనే సమర్పించాలని జీపీ కార్యదర్శిని ఆదేశించారు.