మంచిర్యాల : మంచిర్యాల డిప్యూటీ పోలీస్ కమిషనర్ డి.ఉదయ్ కుమార్రెడ్డి తన చర్య ద్వారా మానవత్వాన్ని చాటారు. దండేపల్లికి చెందిన బాలింత గుడికందుల భాగ్యలక్ష్మి, ఆమె భర్త సతీశ్ ఆస్పత్రిలో చూపించుకునేందుకు మంగళవారం మంచిర్యాల పట్టణానికి వచ్చారు. అయితే లాక్డౌన్ సడలింపు వేళలు ముగియడంతో పట్టణంలోనే చిక్కుకుపోయారు. గ్రామానికి వెళ్లేందుకు ఎటువంటి రవాణా సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. విధుల్లో ఉన్న డీసీపీ ఉదయ్ కుమార్రెడ్డి ఇది గమనించి ఔదర్యం ప్రదర్శించారు. పోలీసు వాహనాన్ని ఏర్పాటు చేసి వారిని ఇంటికి సురక్షితంగా సాగనంపారు. ఈ సందర్భంగా దంపతులు డీసీపీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకోవాలని పోలీసులు సూచించారు. ఒకవేళ ఎమర్జెన్సీ అయితే పోలీసులను సంప్రదించాల్సిందిగా సూచించారు.