సుల్తాన్బజార్, జూన్ 1: కోఠిలోని ఈఎన్టీ దవాఖానలో అన్ని పడకలు నిండిపోయాయని దవాఖాన సూపరింటెండెంట్, నోడల్ అధికారి డాక్టర్ తాటి శంకర్ తెలిపారు. మంగళవారం 106 మంది బ్లాక్ఫంగస్ అనుమానితులు ఓపీకి రాగా 43 మందిని చేర్చుకున్నట్టు చెప్పారు. 32 మంది రోగులకు ఫంక్షనల్ ఎండోస్కోపి సైనస్ సర్జరీలు నిర్వహించామని, కోలుకున్న 24 మందిని డిశ్చార్జి చేసినట్టు పేర్కొన్నారు. పడకలు అందుబాటులోకి తెచ్చేందుకు సర్జరీలు పూర్తయినవారిని సరోజినిదేవి కంటి దవాఖానకు తరలిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 27 మంది రోగులను పంపామని వివరించారు. బ్లాక్ఫంగస్తో దవాఖానలో చేరిన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం, కాంపల్లి బోడ తండాకు చెందిన శ్రీను (57) మంగళవారం శస్త్రచికిత్స చేయాల్సిఉండగా, ఉదయం 11:30 గంటల సమయంలో గుండెపోటుతో మృతిచెందాడని సూపరింటెండెంట్ తెలిపారు.