రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ దార్శనికత, స్ఫూర్తితోనే తెలంగాణను సాధించాం. కుల వివక్షకు తావులేకుండా అత్యున్నత విలువలతో కూడిన లౌకిక, గణతంత్ర, ప్రజాస్వామికదేశంగా భారత్ను తీర్చిదిద్దేందుకు అంబేద్కర్ సూచించిన కార్యాచరణ మహోన్నతమైనది. అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
–సీఎం కేసీఆర్
‘
ధ్యేయం పట్ల నిలువెల్ల అంకితభావం కలిగిన వ్యక్తులే సమాజాన్ని ముందు కు నడిపిస్తారు’ డాక్టర్ అంబేద్కర్ మాటలివి. ఆయన ఆదర్శాలను అందిపుచ్చుకొని యావత్దేశం తనవైపుచూసి అనుసరించే అనివార్యతలను సృష్టించుకున్నది తెలంగాణ. సీఎం కేసీ ఆర్ అందిస్తున్న చేయూతతో రాష్ట్రం లో ‘దళిత వసంతం’ విరాజిల్లుతున్నది.
రాష్ట్రంలో దళితుల సాధికారతకు ప్రాధాన్యమిస్తున్న సీఎం కేసీఆర్ ఈ ఏడాది బడ్జెట్లో రూ.21,306.85 కోట్లు కేటాయించారు. దళితుల అభివృద్ధికోసం అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, వారి కోసం పలు అభ్యుదయ పథకాలను అమలుచేస్తున్నారు. దీంతో మన రాష్ర్టానికి చెందిన ఎస్సీ యువత దేశవిదేశాల్లో తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేస్తున్నది. ఈ క్రమంలో దళితుల ఆరాధ్యుడు అంబేద్కర్ జయంతి సందర్భంగా నమస్తే తెలంగాణ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ 19 ఏండ్లు, టీడీపీ 16 ఏండ్లు పాలించాయి. ఈ 35 ఏండ్లలో రెండు పార్టీలు కలిసి 32,800 మంది దళితులకు 39,798 ఎకరాల భూమిని పంపిణీ చేశాయి. ఇందుకోసం కాంగ్రెస్ రూ.2.65 కోట్లు, టీడీపీ రూ.71 కోట్లు ఖర్చుచేశాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆరున్నరేండ్లలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.678 కోట్లు ఖర్చు చేసి 6,194 కుటుంబాలకు 15,443 ఎకరాల భూమిని పంపిణీచేసింది. రాష్ట్రంలో విస్తారంగా సాగునీరు అందుబాటులోకి రావడంతో బీడు భూములన్నీ సాగుభూములుగా మారాయి. దీంతో ప్రభుత్వం దళితులకు భూమిని కొనుగోలుచేసి పంపిణీ చేయాలని తపిస్తున్నా, అమ్మేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కొంత జాప్యం జరుగుతున్నది.
అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కలలు కనే ఎస్సీ విద్యార్థుల కోసం ప్రభుత్వం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలుచేస్తున్నది. ఈ పథకం రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నది. 2014 నుంచి ఇప్పటిదాకా 605 మంది విద్యార్థులకు రూ. 107.62 కోట్లు అందించింది. ఈ పథకానికి అర్హులైన వారి వార్షిక ఆదాయ పరిమితిని రూ.2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచింది. గమనార్హం. అంతేకాకుండా గత ఆరున్నరేండ్లలో 18 లక్షల మందికి పైగా ఎస్సీ విద్యార్థులు రూ.3,095.61 కోట్లు పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్ పొందారు.
దేశంలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని దేశంలో మరెక్కడాలేనివిధంగా 11 ఎకరాల స్థలంలో 125 అడుగుల ఎత్తులో (పీఠంతో కలిసి 175 అడుగులు) ఎన్టీయార్ గార్డెన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నెలకొల్పుతున్నది. రూ.145 కోట్ల అంచనాతో దీని నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. హైదారాబాద్ బోరబండ ఇందిరానగర్లో 9 అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ నిర్మాణం చివరిదశకు చేరింది. ఈ కేంద్రంలో 26 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు.
కల్యాణ లక్ష్మి
అణగారిన వర్గాల వారి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేయడం ద్వారా సీఎం కేసీఆర్ వారికి మేనమామ అయ్యారు. ఈ పథకం ద్వారా 1,69,508 మంది దళితులకు రూ.1,333.41 కోట్లు అందించారు.దళిత వసంతం
రూ.1000 కోట్లతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్
దళితులు ఇతర ఏ వర్గాలకు తక్కువ కాదని, వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ఈ ఆర్థిక సంవత్సరం నుంచి దళిత సాధికారత పథకం (సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్)ను అమలుచేస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.1000 కోట్లను కేటాయించారు. ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న మినీ డెయిరీ, ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహక పథకం (ఈఎస్ఎస్)కు అదనంగా దీనిని యువతకోసం కేటాయిస్తున్నారు.
దేశానికే గర్వకారణంగా గురుకులాలు
బంగారు తెలంగాణ నిర్మాణ క్రమంలో తొలిమెట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు దేశానికే గర్వకారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం 268 గురుకులాల్లో 1.60 లక్షల మంది విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తు బాటలు వేసుకొంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇప్పటిదాకా 278 మంది విద్యార్థులు ఎంబీబీఎస్లో, 156మంది ఐఐటీ, నిట్ వంటి కోర్సులకు ఎంపికయ్యారు. దళిత బాలికల కోసం ప్రభుత్వం ఎల్బీనగర్లో న్యాయ విద్యా గురుకులాన్ని ఏర్పాటుచేసింది. ఎస్సీల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాంఘిక సంక్షేమశాఖ నేతృత్వంలో కొత్తగా 30 మహిళా డిగ్రీ కాలేజీలను ఏర్పాటుచేసింది.
అభినందనల వెల్లువ
రాష్ట్రంలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి పథకాలను 14 రాష్ర్టాల ప్రతినిధులు అధ్యయనం చేసి భేష్ అని కితాబిచ్చారు. ఎస్సీల అభ్యున్నతకి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆదర్శవంతంగా ఉన్నాయని 15వ ఆర్థిక సంఘం ప్రత్యేకంగా అభినందించింది. దళిత జనోద్ధరణ కోసం తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగానికి తెచ్చిన ప్రత్యేక చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని డిమాండ్ వచ్చేస్తున్నది. ఇదేవిధమైన చట్టాన్ని రాజస్థాన్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించింది.
స్టడీ సర్కిళ్ల ద్వారా ఉద్యోగ అవకాశాలు
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ఎస్సీలకు ఒకే ఒక్క స్టడీ సర్కిల్ ఉండేది. ఇప్పుడు10 కొత్త స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసి ఎంతోమంది ఎస్సీ యువతను ఉద్యోగార్థులను చేయటానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా ఎస్సీ స్టడీ సర్కిళ్లల్లో 4,500 మంది ఉద్యోగార్థులు శిక్షణ పూర్తిచేసుకొన్నారు. వీరిలో 768మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరోవైపు 7,712 మంది ఎస్సీ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వటమే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ నుంచి సబ్సీడీ రుణాలు అందచేసింది. ఇందుకోసం రూ. 3005.6 కోట్లు ఖర్చుచేసింది. మరోవైపు స్పెషల్ ఎకనామిక్ స్కీమ్ ద్వారా ఇప్పటిదాకా రూ.1,46,000 మంది ఎస్సీ యువతకు రూ. 1845 కోట్ల సబ్సిడీ అందజేసింది.