అనుష్క శెట్టి కెరీర్ మొదలు పెట్టి 16 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసింది. ఆమె నటించిన మరికొన్ని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. అయితే ఎన్ని సినిమాలు చేసినా ఒకటి మాత్రం ఈమె కెరీర్ ను వెంటాడుతూనే ఉంది. ‘అరుంధతి’ సినిమాలో అఘోర తరిమినట్లు అనుష్క కెరీర్లో ఆ ఒక్క సినిమా తరుముతూనే ఉంది. ఎంత మర్చిపోవాలి అనుకున్నా కూడా ఆ సినిమా మరుపు రావడం లేదు.. మరవనివ్వడం లేదు. అనుష్కను అంతలా టార్చర్ పెడుతున్న ఆ సినిమా పేరు సైజ్ జీరో. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు కె ఎస్ ప్రకాష్ తెరకెక్కించిన ఈ సినిమా 2015లో విడుదలైంది. కథ బాగున్నా కథనం బాలేక డిజాస్టర్ అయిపోయింది ‘సైజ్ జీరో’.
ఈ సినిమా కోసం అనుష్క ఏ హీరోయిన్ చేయలేని సాహసం చేసింది. ఒకటి రెండు కాదు దాదాపు 40 కేజీల బరువు పెరిగింది. ఈ సినిమాను అప్పట్లో వంద కేజీల బరువుతో చేసింది అనుష్క. సినిమా పట్ల ఆమెకు ఉన్న డెడికేషన్కు అందరూ వారేవా అన్నారు కానీ కెరీర్కు ‘సైజ్ జీరో’ ఏ మాత్రం ఉపయోగపడలేదు. అప్పటికే అనుష్క స్టార్ హీరోయిన్. చేతినిండా సినిమాలు ఉన్నాయి. కానీ బరువు చూస్తే భారీగా పెరిగిపోయింది. ‘సైజ్ జీరో’ తర్వాత బరువు తగ్గాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా ఇప్పటికీ మునుపటి అవతారంలోకి రాలేకపోతుంది అనుష్క. ఒక యోగా టీచర్గా బరువు ఎలా తగ్గాలో ఆమెకు బాగా తెలిసినా కూడా ఎందుకో కానీ ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత పాత అనుష్కల కనిపించలేకపోతుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా కెరీర్కు బాగా ఉపయోగపడకపోగా.. అవకాశాలను కూడా దారుణంగా దెబ్బతీసింది. ‘బాహుబలి 2’, ‘భాగమతి’ లాంటి సినిమాలలో గ్రాఫిక్స్ ఉపయోగించుకొని అనుష్కను సన్నగా చూపించారు దర్శక నిర్మాతలు. గతేడాది విడుదలైన ‘నిశ్శబ్దం’ సినిమాలో కూడా అనుష్క లావుగానే ఉంది. ఇక ఇప్పుడు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ‘రారా కృష్ణయ్య’ దర్శకుడు మహేష్ తెరకెక్కించబోయే ఒక సినిమాలో నటిస్తోంది అనుష్క. అందులో నవీన్ పొలిశెట్టి హీరోగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బరువు తగ్గి సన్నగా కనిపించాలని చాలా ప్రయత్నిస్తోంది అనుష్క శెట్టి. అందుకే బరువు తగ్గిన తర్వాత షూటింగ్ మొదలు పెట్టాలని ఆలోచిస్తుంది ఈ భామ. ఈ విషయంలో అనుష్క ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా కూడా ‘సైజ్ జీరో’ మాత్రం అనుష్క కెరీర్లో ఎప్పటికీ చెరిగిపోని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందనేది కాదనలేని వాస్తవం.