మహబూబ్నగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక బంగారమైంది. కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలవుతున్నది. దీనిపై ప్రత్యక్షంగా.. పరోక్షంగా.. ఆధారపడ్డ వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎండాకాలం కావడంతో భవన నిర్మాణ రంగానికి చాలా అనువైన సమయం. ఈ టైంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక కొరతను సృష్టించి మాఫియా చెలరేగిపోతుంది. ఇటు పోలీసులు, రెవెన్యూ అధికారులు.. అ టు మైనింగ్ శాఖ అవినీతికి అడ్డూ అదుపు లేకుండాపోయింది.
ఫలితంగా తక్కువ ధరకు దొరకాల్సిన ఇసుక ఏకంగా ఓ టిప్పర్ ధర రూ.50 వేల పలుకుతున్నది. అ ది కూడా బ్లాక్లోనే. కొన్ని జిల్లాల్లో మన ఇసుక పేరు మీద ఆయా కలెక్టర్లు గుర్తించిన రీచ్లలో కూడా మా ఫియా చెలరేగిపోతుంది. అమాయకుల పేరు మీద ఇసుకను బుక్ చేసుకుంటూ వాటిని బ్లాక్లో అమ్ముకుంటున్నారు. ఫలితంగా ఇసుక ధర ఆకాశాన్నంటింది. సామాన్యులకు ఇసుక లభించని పరిస్థితి తలెత్తింది. ఇక గ్రా మాల్లో అయితే ట్రాక్టర్ ఇసుక ధర రూ.6 వేలకుపైగా పలుకుతున్నది. కొంతమంది దొంగచాటుగా ఇసుకను ఎడ్లబండ్లపై రాత్రికి రాత్రి తరలిస్తున్నారు. ఇసుక మాఫియాను అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
నారాయణపేట జిల్లాలో కలెక్టర్ పేరుపై ఇసుక మాఫి యా చెలరేగుతుంది. అన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఇసుక మాఫియా జోరుగా నడుస్తుంది. మా మూళ్ల మత్తులో అధికారులు ఉండడంతో రాజకీయ నా యకులు చెప్పిందే వేదంగా మారింది. కొన్నిచోట్ల ప్ర జలు అక్రమంగా తరలిస్తుండగా.. పట్టుకొని పోలీసుల కు అప్పగిస్తున్నా క్షణాల్లోనే వాటిని వదిలేస్తున్నారన్న అ పవాదులు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో వాగులు వంకల్లో ఇసుక నిల్వలు చాలా ఉన్నాయి. వాటిని ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా వినియోగిస్తే ఎలాంటి కొరత ఉండదు. కానీ అధికార యంత్రాంగం ఇసుక మాఫియా.. ఎమ్మెల్యేలు కుమ్మక్కు కావడంతో ఇసుక దొరకని పరిస్థితి దాపురించింది.
దీంతో చాలా జిల్లాల్లో నిర్మాణరంగం ఎక్కడికక్కడ ఆగిపోయింది. మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఏకంగా జర్నలిస్టుల పే రుపై ఓ ఎమ్మెల్యే మేనమామ అక్రమంగా ఇసుకను తరలించడం వివాదాస్పదంగా మారింది. అన్నిచోట్ల ఎమ్మె ల్యే ప్రత్యక్షంగా చొరవ తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాఫియా ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యాపారం సాగుతున్నది. అధికారులు ఎవరైనా పట్టుకుంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులమంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని పోలీసులే చెబుతున్నారు. దీంతో అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇసుక కొరతను సృష్టించిన అధికారపార్టీ నాయకులు, ఇసుక మాఫియా ఆగడాలు భవన నిర్మాణరంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎం డాకాలంలో చాలామంది కూలీలకు పనులు దొరకని పరిస్థితి. దీంతో వారంతా భవన నిర్మాణ పనులకు ఎ క్కువగా వెళ్తుంటారు. ఈ నాలుగు నెలలు సీజన్. ఇసుక కొరతతో కూలీలకు కూడా పనులు లేకుండా పోయా యి. వారి కుటుంబాలు పస్తులు ఉండే పరిస్థితి నెలకొన్నది. అయితే ఇసుక కొరతను ఆసరాగా చేసుకున్న మా ఫియా రెచ్చిపోతుంది. భవన నిర్మాణ రంగంలో మిగ తా మెటీరియల్ చౌకగా దొరకుతున్నా.. ఉచితంగా ల భించే ఇసుకను మాత్రం రూ.వేలు పెట్టి కొనుగోలు చే యాల్సి వస్తుందని జనం వాపోతున్నారు.
మరోవైపు అ ధికార పార్టీ నాయకులకు కూడా మాఫియాకు అండదండలు అందిస్తుండడంతో వాళ్లు ఆడిందే ఆట.. పాడిం ది పాటగా మారింది. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు సైతం వారికి అండగా ఉండడంతో ఇసుక మా ఫియా రెచ్చిపోతుంది. వాళ్లు చెప్పిన ధరకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతరత్రా పరిస్థితుల్లో ఇసుకను తరలిస్తుంటే వారిపై అక్రమంగా కేసులు నమోదు చేయిస్తున్నారు. మామూలు ఇచ్చిన టిప్పర్లు, ట్రాక్టర్లను మాత్రం వదిలి పెడుతున్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ని ర్మాణంలో నారాయణపేట జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మేనమామ అక్రమాలకు తెర లేపారు. పేట నియోజకవర్గానికి సంబంధించిన మండలం మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉండడంతో అక్కడ ఇసుకను తరలించేందుకు అనుమతులు తీసుకొని జర్నలిస్టులకు మొండిచేయి చూపించారు. అదే జిల్లాలోని మరో ఎమ్మెల్యే కు టుంబ సభ్యులు, అధికారులను బెదిరిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఎమ్మెల్యే నేరుగా అధికారులకు ఫోన్ చేసి ఇసుక టిప్పర్ల జోలికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఇసుకను తక్కువ ధరకు అం దించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో ఇ సుక మాఫియాకు వత్తాసు పలుకుతున్నారు. పే రుకే మన ప్రాంతం.. మన ఇసుక-మన పాలమూరు పేరు మీద ఇసుక రీచ్లకు అనుమతులు ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్టులు అప్పగిస్తున్నారు. పేరుకు అక్కడ వీఆర్ఏలు, రెవెన్యూ అధికారులను పర్యవేక్షణ పేరుతో ఉంచి బహిరంగం గా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక టిప్పర్ లో ఆరు క్యూబిక్ మీటర్ల ఇసుక వేయాల్సి ఉండ గా 8 నుంచి 10 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఎక్కు వ మోతాదులో వేసి రవాణా చేస్తున్నారు.
ఎక్కు వ వేసిన ఇసుకకు డబ్బులను వసూలు చేస్తున్నా రు. మరోవైపు ఒకే బుకింగ్ మెసేజ్తో రెండు, మూడు ట్రిప్పులు అదనంగా తరలిస్తున్నారు. ఇ దంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నది. కాగా ఇక్కడ ఇసుకను ఇటాచీల ద్వారా టిప్పర్లు, ట్రాక్టర్లలోకి లోడ్ చేసే పనిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇసుక మాఫియా ఈ కాంట్రాక్టులను చేజిక్కించుకొని అధికారులను మచ్చిక చేసుకొని అక్రమాలకు తెర లేపుతున్నారు.
నారాయణపేట జిల్లాలో కలెక్టర్ పేరు చెప్పి ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ న డుస్తున్న అన్ని రీచ్లను ఎమ్మెల్యే అనుచరులే దగ్గరుండి నడపడం అనుమానాలకు తావిస్తోంది. ఫలితంగా గృహ నిర్మాణాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నడూ లేని పరిస్థితిని గృహనిర్మాణదారులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇసుకను తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చి మాఫియా ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. మహబూబ్నగర్, నారాయణపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలో అనేక చోట్ల ఇసుక నిల్వలు ఉచితంగా లభిస్తున్నాయి.. కానీ బహిరంగ మార్కెట్లో అక్రమంగా రవాణా చేసి వేలాది రూపాయలు సొ మ్ము చేసుకుంటున్నారు.. దీనికి అధికార యంత్రాం గం.. అధికార పార్టీ నాయకులు తోడుకావడంతో ఇ సుక కొరత తీవ్రంగా ఏర్పడింది. కొరతను సృష్టించి ఇసుక మాఫియా బ్లాక్లో వారికి ఇష్టంవచ్చిన ధరల కు అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు.
ఇందులో అధికారులకు, అధికార పార్టీ నాయకులకు వాటాలు చెల్లిస్తూ ఉండడంతో ఇసుక ధరకు రెక్కలు వచ్చాయి. టిప్పర్ ఇసుక కావాలంటే రూ.50 వేలు వెచ్చించాల్సిందే.. అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ ఇసుక మాఫియానే బినామీ పేర్ల మీద బుక్ చేసుకొని తక్కువ ధరకే తీసుకొని.. ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ఫలితంగా ఇసుక ధర పెరగడంతో కొనలేని పరిస్థితి దాపురించింది. చాలామంది ఇసుక లేకపోవడంతో ని ర్మాణ పనులను నిలిపివేసుకున్నారు.