శ్రీరాంపూర్, సెప్టెంబర్ 24 :సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ విద్యుత్ తయారీలో దూసుకెళ్తున్నది. తాజాగా భూగర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో కరంట్ను తయారు చేసే (జియో థర్మల్) కేంద్రాన్ని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో నూతన ఆలోచనలతో ముందుకెళ్తున్న సీఎండీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. దేశంలో మొదటిసారిగా జియె థర్మల్ కేంద్రాన్ని మరో ఆరు నెలల్లో ప్రారంభించేందుకు ఏ ర్పాట్లు చేస్తున్నారు. సింగరేణి అధికారులు, నిర్మాణ సంస్థ శ్రీ రామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులతో గురువారం ప్రత్యేకంగా సమీక్షించారు. నిర్ణీత గడువు కన్నా ఆరు నెలల ముందే.. అంటే ఈ ఆర్థిక సంవత్సరం మా ర్చికల్లా నిర్మించాలని భావిస్తున్నారు. ఆ మేరకు జియో థర్మల్ విద్యుదుత్పత్తి చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు.
20 కిలోవాట్ల విద్యుదుత్పత్తి..
మణుగూరు ఏరియా పరిధిలోని అటవీ, గిరిజన గ్రామాలైన పగిడేరు, ఖమ్మంతోగు, బుగ్గ తదితర గ్రామాల్లో వేడినీటి మడుగులు ఉన్న విషయం దశాబ్దాల కాలంగా స్థానికులకు విదితమే. కాగా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు పగిడేరు ప్రాంతంలో పదేళ్ల క్రితం డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు గ్రామానికి సమీపంలోని పొలాల్లో వేడి నీరు ఉబికి వస్తున్నట్లు గుర్తించారు. సుమారు వెయ్యి మీటర్ల లోతు నుంచి ఈ నీరు వచ్చినట్లు నిర్ధారించారు. బొగ్గు అన్వేషణలో భాగంగా బోర్ హోల్స్ వేస్తున్నప్పుడు సింగరేణి సంస్థ అధికారులు కూడా గమినించారు. 50 నుంచి 90 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉబికివస్తున్న వేడినీటిని వినియోగించి విద్యుత్ను తయారు చేయవచ్చన్న విషయాన్ని గుర్తించి, ఈ దిశగా శాస్త్రీయ అధ్యయనం చేసి ప్లాంట్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను నివేదిక ద్వారా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆ శాఖ, పగిడేరు ప్రాంతంలో భూ గర్భం నుంచి ఉబికి వచ్చే వేడి నీటితో 20 కిలోవాట్ల విద్యుత్ను ప్రయోగాత్మకంగా ఉత్పత్తి చేసేందుకు ముందుకొచ్చింది. ఆ మేరకు కేంద్రం 1.72 కోట్లను కేటాయించింది. సింగరేణి ఆధ్వర్యంలో ఢిల్లీకి చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కంపెనీ కార్యాచరణను రూపొందించింది. పగిడేరు సమీపంలో 3 వేల చదరపు అడుగుల ప్రైవేట్ స్థల సేకరణ, గ్రామం నుంచి అప్రోచ్ రోడ్డు నిర్మాణం, నీరు ఉబికి వస్తున్న బోర్ హోల్ వద్ద యంత్ర విభాగం ఏర్పాటుకు అవసరమైన షెడ్డు నిర్మాణం, ఆ ప్రదేశానికి చుట్టూ ఫెన్సింగ్, ఉత్పత్తయిన విద్యుత్ను ట్రాన్కోకు అనుసంధానం చేసేందుకు కావాల్సిన లైన్ల నిర్మాణంపై నివేదిక సిద్ధం చేసింది.
మార్చి 30 వరకు ఉత్పాదనే లక్ష్యం..
జియో థర్మల్ విద్యుదుత్పత్తి ఆరు నెలల్లో అంటే రాబోయే మార్చి కల్లా ప్రారంభించే లక్ష్యంతో అధికారులు పనులు వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగానే జీఎం (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) సుభాని, మణుగూరు జీఎం జక్కం రమేశ్, డీజీఎం కనకయ్య, శ్రీరామ్ ఇనిస్టిట్యూట్కు చెందిన జీఎం శ్రీరామ్ కంపెనీ నుంచి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్స్ పగిడేరు సమీపంలో ప్రాజెక్టు నిర్మాణ స్థల ప్రదేశాన్ని పరిశీలించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణం అక్టోబర్ 11వ తేదీ వరకు, బోర్ హోల్స్కు వాల్వ్, కేజ్ ఏర్పాటు వంటివి డిసెంబర్ 17వ తేదీ వరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు ప్లాంట్ విడి భాగాలు పగిడేరుకు తెప్పించి అమర్చాలని, 2022 మార్చి 30వ తేదీ వరకు విద్యుదుత్పత్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రెండు దశాబ్దాలుగా పగిడేరు వద్ద ఉబికి వస్తున్న ఈ వేడి నీటిని స్థానికులు తమ అవసరాలకు వినియోగించుకుంటున్నారు. విద్యుదుత్పత్తి మొదలైన తర్వాత రీసైకిల్ చేసిన నీటిని విడుదల చేస్తారు. గ్రామస్తులు యథావిధిగా నీటిని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అతి త్వరలోనే ప్లాంటు ఏర్పాటు చేసే లక్ష్యంతో సింగరేణి వేగవంతం చేస్తున్నది. మణుగూరులో చేపడుతున్న జియో థర్మల్ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని చేపట్టే అవకాశముంటుంది.