మహబూబ్నగర్, నవంబర్ 24 : ఠాగూర్ సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖాన వైద్యులు వ్యవహరించారు. జ్వరం వచ్చిందని మహిళ దవాఖానకు వెళ్తే.. ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తున్నట్లు నమ్మించి.. చికిత్సకు డబ్బులు కట్టించుకున్న తర్వాత.. చివరకు పరిస్థితి విషమించి మృతి చెందిందని అక్కడి వైద్యులు చావు కబురు చల్లగా చెప్పిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మహబూబ్నగర్ మండలం కోడూర్కు చెందిన లలిత(35)కు జ్వరం రావడంతో జిల్లా కేం ద్రంలోని వన్టౌన్ ప్రాంతంలోని శ్రీ మల్టీ స్పెషాలి టీ దవాఖానకు ఈనెల 21న అడ్మిట్ అయ్యింది.
పరీక్షించిన వైద్యులు మహిళ ఊపిరితిత్తుల్లో వాటర్ ఉందని, వెంటనే తీయాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. కుటుంబ సభ్యులను చూడనీయకుండా ఐసీయూలో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నట్లు నమ్మబలికారు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు వైద్యులను నిలదీశారు. మాకు చూపించకుండా.. చెప్పకుండా వైద్య సేవలు అందిస్తున్నారని నిలదీశారు. అప్పుడు డాక్టర్లు స్పందించి వైద్యసేవలు అందిస్తున్నట్లు చూపించారు. చికిత్స అందిస్తుండగా.. ఆదివారం సాయంత్రం మృ తి చెందినట్లు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉంటే కనీస సమాచారం ఇవ్వకుండా.. వైద్యం అందిస్తున్నామని చెప్పి.. మరణించాక.. దాదాపు రూ.3 లక్షలకుపైగా బిల్లు చెల్లించిన తర్వాత మృతిచెందిన విషయాన్ని తెలిపారని ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపించా రు.
సోమవారం గ్రామస్తులు పెద్ద సంఖ్యలో దవాఖాన వద్దకు చేరుకొని వరకు ఆందోళనకు దిగారు. లలితను అన్యాయంగా చంపారని.. పరిస్థితి విషమించి చనిపోయినా చెప్పకుండా నాటకం ఆడుతూ డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. అయితే కొందరు డాక్టర్లు వచ్చి నిర్లక్ష్యంగా మాట్లాడడంతో ఆగ్రహంతో వారిపై దాడికి యత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విషయం తెలుసుకొన్న వన్టౌన్, టుటౌన్, రూరల్ ఎస్సైలు అక్కడకు చేరుకొని నచ్చజెప్పే యత్నం చేశారు. దాదాపు 2 గంటలు ధ ర్నా చేయడంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయా యి. డీఎస్పీ వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకోగా రూ.3 లక్షల వరకు చెల్లిస్తామని దవాఖాన యాజమాన్యం చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా దవాఖా న యాజమాన్యాన్ని వివరణ కోరగా.. మ హిళ పరిస్థితి విషమంగా ఉందని ముందే చెప్పామన్నారు.