దేవరకద్ర, జనవరి 8 : కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందిచడమే ప్రభుత్వ ధేయమని దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి యాసంగి పంటలు సాగు చేసేందుకు సాగు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయకట్టు రైతులకు సాగు నీటి కష్టాలు ఉండవన్నారు. ఎడమ కాల్వ దేవరకద్ర నియోజకవర్గం పరిధిలో వస్తుందని, కుడి కాల్వ నారాయణపేట జిల్లా పరిధిలోకి వస్తుందన్నారు. ఆయకట్టు కింద ఉన్న దేవరకద్ర, చిన్నచింతకుంట, మరికల్, ధన్వాడ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు సాగు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు.
ఆయకట్టు రైతులు బాధ్యతగా ఒకరి తర్వాత ఒకరు నీరు పారించుకోవాలని, ఒక వెళ నీరు ఎక్కవై వృథా పోతుంటే వేంటనే ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి కాల్వల నుంచి నీటి సరఫరాను బంద్ చేయించాలన్నారు. యాసంగిలో ఆయకట్టు రైతులకు ఐదు విడుతలుగా నీటి సరఫరా చేస్తామన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టు ప్రకృతి సిద్ధంగా కొండల మధ్య ఆహ్లాదకరమైన, అద్భుతమైన వాతావరణంలో ఉందన్నారు. పర్యాటక రంగంలో వెనుకబడిపోయిందని, ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టును పర్యాటక స్థలంగా మారుస్తామని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భారతమ్మ, ప్రాజెక్టు చైర్మన్ ఉమామహేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు ఈఈ ప్రతాప్సింగ్, నాయకులు అంజిరెడ్డ్డి, అరవింద్కుమార్రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, రాఘవేందర్రెడ్డి, వెంకటేశ్, భరత్, గోపాల్తోపాటు ఆయకట్టు రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.