మహబూబ్నగర్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కోయిల్సాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, రాజేందర్రెడ్డి భరోసా ఇచ్చారు. యాసంగి సీజన్కు సాగునీటిని విడుదల చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందొద్దన్నారు. ఆదివారం మండలంలోని కోయిల్సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల నుంచి ఎమ్మెల్యేలు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఎడమ కాల్వ దేవరకద్ర నియెజకవర్గ పరిధిలోకి వస్తే.. కుడి కాల్వ నారాయణపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుండడంతో జలాలకు పూజలు చేసి ఎమ్మెల్యేలు తూము గేట్లను తెరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గతేడాది ప్రాజెక్టులో నీళ్లున్నా కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టకపోవడంతో నీటి విడుదల కొనసాగలేదన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ప్రాజెక్టులో ప్రస్తుతం 32 అడుగుల నీరు ఉన్నదన్నారు. ఈసారి డిసెంబర్ చివరి వారంలోనే పూర్తిస్థాయి నీటిమట్టం ఉండడంతో ఆయకట్టుకు ముందుగానే నీటిని విడుదల చేశామని చెప్పారు. సాగునీటి రాకతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ యాసంగిలో 12 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిందచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆయా గ్రామాలకు చెందిన రైతులు సాగునీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఎడమ కాలువ కింద 3 వేల ఎకరాలు, కుడి కాలువ కింద 9 వేల ఎకరాలకు తొలి విడుతగా నీటిని అందిస్తామన్నారు. కోయిల్సాగర్ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలో నయాపైసా ఖర్చు చేయలేదని, సీఎం కేసీఆర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా.. కాల్వల ఆధునీకరణకు రూ.70 కోట్లు విడుదల చేశారని తెలిపారు. పనులు పూర్తి చేయడంతో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే అవకాశం ఏర్పడిందన్నారు. జూరాల డ్యాం నుంచి నీటిని మళ్లించి పూర్తిస్థాయిలో నీటిని నిల్వ ఉంచినట్లు తెలిపారు. వాగులపై చెక్డ్యాంలు నిర్మించడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయన్నారు. గతేడాది 25 వేల ఎకరాల్లో వరి సాగైతే ఈసారి 99 వేల ఎకరాల్లో పండించినట్లు తెలిపారు. యాసంగిలోనూ బ్రహ్మాండంగా సాగు కానున్నదన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఉచితంగా నిరంతర విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా, రైతు సంక్షేమ పథకాలతో వ్యవసాయం పెరిగిందన్నారు. నారాయణపేట జిల్లా చుట్టూ కర్ణాటక రాష్ట్రంలో అమలు కాని పథకాలు కేసీఆర్ విజన్ వల్ల తెలంగాణలో అర్హులకు అందుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని, ప్రజలు గమనించాలని సూచించారు. తెలంగాణపై కేంద్రం ఆరోపణలు మాని రైతు సంక్షేమానికి సహకరించాలన్నారు. లేకుంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇరిగేషన్ ఈఈ ప్రతాప్సింగ్ మాట్లాడుతూ విడుతల వారీగా నీటిని అందిస్తామన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 2.2 టీఎంసీలు నిల్వ ఉన్నాయని, జూన్ వరకు నీళ్లు అందుబాటులో ఉంటాయన్నారు.
కోయిల్సాగర్ ప్రాజెక్టు నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే ఆల, రాజేందర్రెడ్డి సరదాగా చేపలు పట్టారు. కొందరు చేపలు పడుతుండడంతో వారితో కలిసి ఎమ్మెల్యేలు గాలాలు వేశారు. ఎమ్మెల్యే ఆల గాలానికి చేప పడటంతో సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, ఈఈ ప్రతాప్సింగ్, ఏఈ చందు, నాయకులు శ్రీకాంత్యాదవ్, జెట్టి నర్సింహారెడ్డి, కొండారెడ్డి, వెంకటేశ్, శ్రీనివాస్రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.