వనపర్తి టౌన్, సెప్టెంబర్ 18: నిజమైన స్వాతంత్య్రం, పరిపాలన 2014 జూన్ 2నుంచే ప్రారంభమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన ఎనిమిదేండ్ల పాలన దేశానికి తలమానికంగా నిలిచి గర్వకారణంగా ఉందన్నారు. 1946 రాచరికం వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందన్నారు. 40ఏండ్ల పాటు బానిస వ్యవస్థ పరిపాలన కొనసాగిందని రాష్ట్రం ఏర్పడ్డాక మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నా లెఫ్ట్నెంట్ గవర్నర్ చేత పరిపాలన చేయించిందని విమర్శించారు.
రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణను భారతదేశంలో పోలీస్చర్య ద్వార విలీనం చేపట్టాక తెలంగాణలోని రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున కొనసాగుతుందని, ఈ పోరాటం దేశ వ్యాప్తంగా కొనసాగితే ప్రమాదం ఉందని సైన్యం చేత వేలాది మందిని అణచివేసి చంపివేశారని మంత్రి గుర్తుచేశారు. చరిత్ర ఆధారాలను యదార్థాలను మంచిని మంచిగా చెడును చెడుగా భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతోనే సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు, మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య పాల్గొన్నారు.