వనపర్తి, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం వద్దన్నోళ్లు, తెలంగాణను ఎక్కిరించినోళ్లు, రాష్ట్రం ఇస్తే బాగుపడరు.. అన్నవాళ్లు ఇప్పుడు థర్డ్క్లాస్ రాజకీయాలు చేస్తూ గాలిమాటలు చెబుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వారి మాటలు నమ్మొద్దని సూచించారు. ‘వేటకు పోయినప్పుడు కడుపునొప్పి అన్నోడు.. కుప్పల కాడికి వచ్చి నాకోటి ఇయ్యి’ అన్న చందంగా ఉందన్నారు. ఆదివారం వనపర్తి జిల్లాలోని పలు గ్రామాల్లో ఆసరా లబ్ధిదారులకు పింఛన్ కార్డులు పంపిణీ చేశారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడ్డాకే మార్పు సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్తోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమైందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఇంత విజన్ లేదన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవన్నారు. సంక్షేమంతోపాటు వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసినట్లు తెలిపారు.
గతంలో భూములు ఉండేవీ కానీ.. సాగునీరు ఉండేది కాదని.. కానీ నేడు సాగునీరు, నిరంతర విద్యుత్తోపాటు పంటల పెట్టుబడికి చింత లేదన్నారు. రైతుబంధు, రైతుబీమా కర్షక కుటుంబానికి ఆర్థిక భరోసా ఇస్తున్నాయన్నారు. గతంలో రూ.20 వేలు, రూ.30 వేలకు ఎకరా అమ్ముకున్నారని గుర్తు చేశారు. నేడు ఎకరా రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షలు భూమి ధరలు ఉన్నాయన్నారు. ఖాన్చెరువుకు నీళ్లు తెచ్చే కెనాల్ పనులు త్వరలో మొదలు పెడుతామని తెలిపారు. సాగునీటి వాడకంలో వనపర్తి చరిత్ర సృష్టించబోతుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాలో కృష్ణా జలాలను పారిస్తామన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని కోరారు. తెలంగాణలోని విపక్ష రాజకీయ పార్టీల వ్యవహారం మీకు తెలిసిందేనని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో వ్యవసాయాధారిత పరిశ్రమలను తీసుకొస్తామన్నారు. ప్రతి జిల్లాలో 400 నుంచి 500 ఎకరాల్లో పరిశ్రమలు వస్తున్నాయని తెలిపారు.
రెండు, మూడేండ్లలో ప్రతి పంటకూ డిమాండ్ ఉండేలా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందించామన్నారు. అనంతరం కిష్టగిరిలో రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ను, మెంటెపల్లిలో గ్రామ పంచాయతీ కార్యాయాన్ని, ఎస్సీ కమ్యూనిటీ హాల్, క్రీడా మైదానాన్ని మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోక్నాథ్రెడ్డి, ఎంపీపీ కిచ్చారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, టీఆర్ఎస్ శిక్షణా కార్యక్రమాల కన్వీనర్ మెంటపల్లి పురుషోత్తంరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహ, విండ్ అధ్యక్షుడు వెంకట్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, మండల యూత్ అధ్యక్షుడు చిట్యాల రాము, ప్రధాన కార్యదర్శి గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
నేనున్నా.. ఒక నిరుపేదకు అండగా ఉంటానని మంత్రి నిరంజన్రెడ్డి హామీ ఇచ్చారు. వనపర్తి మండలం పెద్దగూడేనికి చెందిన సురేశ్ పేదరికంతో జీవిస్తున్నాడు. కనీసం తలదాచుకోవడానికి సరైన గుడిసె లేదు. భార్య, ముగ్గురు పిల్లలు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నిరంజన్రెడ్డి స్వయంగా అతడి ఇంటికెళ్లి పరామర్శించాడు. కుటుంబ వివరాలు అడిగి తెలుసుకొని అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. గూడులేని సురేశ్కు సొంత ఇల్లు ఉండేలా చూస్తానని, త్వరలో రాబోయే గృహనిర్మాణ పథకంలో రూ.3 లక్షలు వస్తాయని, మొదటగా నీకే ఇస్తానని హామీ ఇచ్చారు. దీంతో మంత్రికి దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.