వనపర్తి, మే 2 (నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్ కార్యాలయంలో ఉన్నతాధికారుల సాక్షిగా వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకున్నది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి నిర్వహించి అధికారులు ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తారు. కలెక్టర్ షేక్యాస్మిన్బాషా సెలవులో ఉండటంతో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, ఆశీష్సెంగ్వాన్ ప్రజలనుంచి వినతులు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో వనపర్తి మండలం రాజనగరం గ్రామానికి చెంది న శివకుమార్ నేరుగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వద్ద కు వెళ్లి వినతిపత్రం అందించాడు. ఉద్యోగం కావాలని లేదా పింఛన్ ఇప్పించాలని కోరాడు. వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించి వినతిపత్రం స్పష్టంగా లేదని మార్చుకొని తీసుకువస్తే మీ సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని సూచించారు. ఈ మాటవిన్న శివకుమార్ కోపంతో అదనపు కలెక్టర్ చెంప చెల్లుమనిపించాడు. సెకన్లవ్యవధిలో అకస్మాత్తుగా జరిగిన ఘటనతో అక్కడఉన్న జిల్లా అధికారులందరూ నివ్వెరపోయారు. వెంటనే అక్కడ ఉన్న కలెక్టరేట్ సిబ్బంది, పోలీసు సిబ్బంది శివకుమార్ను పట్టుకొని రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వనపర్తిరూరల్ పోలీసుస్టేషన్లో అకారణంగా తనపై దాడిచేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదనపు కలెక్టర్పై దాడికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
విచారణచేస్తున్నాం..
అదనపు కలెక్టర్పై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు వనపర్తి సీఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపడతామని సీఐ తెలిపారు.