వనపర్తి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు విషయంలో రైతుల నిరసన సెగ ఢిల్లీకి తగలాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రానిది బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. బుధవారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి సమావేశమై మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఈ రాష్ర్టానికి బీజేపీ నేతలు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలది చేతగాని తనమన్నారు. రైతుల ఆందోళనలు చూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆగ్రహజ్వాలలు దేశమంతా అలుముకుంటాయని మంత్రి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే శుక్రవారం గ్రామాల్లోని ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసనలు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్ష్మయ్య, పెబ్బేరు మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, విండో చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.