పటిష్టంగా తాళ్ల చెరువు
కనుమరుగవుతున్న తాళ్ల చెరువును పటిష్టం చేయాలన్న లక్ష్యంతో పనులు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.బుధవారం మంత్రి తాళ్లచెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి చుట్టూ ఉన్న చెరువులు, కుంటలు పటిష్టం చేస్తున్నామన్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, ఇన్చార్జి కమిషనర్ వెంకన్న, అధికారులు ఉన్నారు.
వనపర్తి, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : వనపర్తి జిల్లా కేంద్రం నూతన సొబగులు అద్దుకుంటున్నది. రోడ్ల విస్తరణతోపాటు అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతుండడంతో రూపురేఖలు మారిపోయాయి. కాగా, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సాగు, తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో నీటి ఇబ్బందులు లేకుండా భూగర్భ జలాలను పెంచాలనే ఉద్దేశంతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. పట్టణ ప్రజల నీటి అవసరాలు, అటవీ జీవుల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నారు. వనపర్తికి సమీపంలో ఉన్న చెరువుల్లో వేసవిలో కూడా నీరు ఉండేలా పక్కా ప్రణాళికతో పనులు చేపడుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విధానాన్ని రూపొందించారు. లక్ష్మీకుంట చెరువును పునరుద్ధరించడంతో మర్రికుంటతోపాటు హౌసింగ్బోర్డు కాలనీకి నీటి ఎద్దడి తీరనున్నది.
వనపర్తి నలుదిశలా చెరువులు..
వనపర్తి పట్టణం చుట్టూ నలుదిశల్లో నాలుగు చెరువులను మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాజనగరం ప్రాంతంలో అమ్మ చెరువు, చిట్యాల మార్గంలో నల్ల చెరువు, పట్టణంలో ఉన్న తాళ్ల చెరువు, పట్టణానికి జలాధారమైన లక్ష్మీకుంటను అభివృద్ధి చేస్తున్నారు. చిట్యాల, గోపాల్పేట మార్గంలో ఉన్న నల్ల చెరువును దాదాపు రూ.9 కోట్లతో సుందరీకరిస్తున్నారు. నల్లచెరువుపై ట్యాంక్బండ్ను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రజలు ఆహ్లాదంగా గడిపేలా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. ట్యాంక్బండ్ పనులు పూర్తయితే గోపాల్పేట-చిట్యాల మార్గం దగ్గర కానున్నది. పార్కులు, ఓపెన్జిమ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నారు.తాళ్ల చెరువును రూ.కోటితో అభివృద్ధి చేస్తున్నారు. కట్టను బలోపేతం చేయడంతోపాటు కూర్చొని చెరువు అందాలను వీక్షించేలా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్, టాయిలెట్లు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు.
లక్ష్మీకుంటపై మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. ఈ కుంటకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈదుల చెరువు నుంచి పైప్లైన్ ద్వారా నీటిని తరలిస్తున్నారు. ఈ కుంటలో నీటిని నింపితే చుట్టు పక్కల ప్రాంతాలకు నీటి ఎద్దడి తీరనున్నది. అలాగే అటవీ జీవులకు ప్రాణాధారంగా ఉండనున్నది. నీటిని పంపింగ్ చేసేందుకు 20 హెచ్పీ సామర్థ్యం గల మూడు మోటార్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పర్యాటక ప్రాంతంగానూ తీర్చిదిద్దుతున్నారు. కొత్తకోట మార్గంలో ఉన్న అమ్మ చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి.
సంబురమైతున్నది..
చెరువులు, కుంటలు పునరుద్ధరణ చేస్తే నీటి కటకట ఉండదు. మంత్రి నిరంజన్రెడ్డి ద్వారానే అభివృద్ధి సాధ్యమైంది. ఒకప్పుడు ఎండాకాలంలో గొంతు తడుపుకోవడానికి నీళ్లు ఉండేవి కావు. బోర్లు, బావులు ఎండిపోయేవి. మంత్రి ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం చెరువులు జలకళ సంతరించుకున్నాయి. భూగర్భజలాలు పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా వస్తున్నాయి. చెరువులు అందంగా ముస్తాబవుతుంటే సంబురమేస్తున్నది. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు.
– నర్సింహ, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు, వనపర్తి
కనీవినీ ఎరుగని అభివృద్ధి..
చెరువుల అభివృద్ధితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తాగు, సాగు నీటితోపాటు భూగర్భ జలాలు పెరిగి వేసవికాలంలో నీటి ఎద్దడికి తావుండదు. మంత్రి నిరంజన్రెడ్డి ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. నగరం చుట్టూ అందమైన చెరువులు, పార్కులు ఉండడంతో ప్రతిఒక్కరూ ఆహ్లాదకరంగా గడిపే అవకాశం ఉంటుంది. దశాబ్ధాల చరిత్ర ఉన్న చెరువులు కొత్తగా కనబడుతున్నాయి. వనపర్తిలో కనీవినీ ఎరుగని అభివృద్ధి జరుగుతున్నది. అటు పార్కులు, ఇటు నీటి వనరులతో అలరారడం సంతోషించదగ్గ విషయం.
– నందిమళ్ల భువనేశ్వరి, కౌన్సిలర్, వనపర్తి