వనపర్తి, మార్చి 28: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు సోమవారం కార్మికలోకం కదిలింది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యోగ, ప్రజాసంఘాలు, వివిధ పార్టీల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపడంతో పార్టీ శ్రేణులు నిరసనలో పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్చౌరస్తా ఎదుట నిరసన తెలిపారు. అనంతరం పలు ఉద్యోగ, ప్రజాసంఘాల నాయకులతో కలిసి రాజీవ్చౌరస్తా, పొట్టిశ్రీరాములు చౌరస్తా మీదుగా కలెక్టరేట్కు చేరుకొని సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ మాట్లాడుతూ నాకు భార్య లేదు.. పిల్లలు లేరు.. అంటూ సన్యాసిలా ఉన్న ప్రధాని మోదీజీకి ఏం తెలుస్తుంది మధ్యతరగతి, పేద కుటుంబాలు అనుభవిస్తున్న కష్టాలు అని ప్రశ్నించారు.
నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి పంటను ఎక్కడైనా కొనొచ్చు, అమ్ముకోవచ్చని సాకులు చెబుతూ ధాన్యం నిల్వచేసే గోదాంలు ఉన్న అంబానీ, ఆదానికి ఆదాయం పెంచేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీ మతోన్మాదం పేరుతో యువతను తప్పుదోవ పట్టిస్తుందని ఆరోపణలు చేశారు. అంతకుముందు టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్గౌడ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంవత్సరానికి 25లక్షల మంది ఆకలితో చనిపోతున్నారని, 20కోట్ల మంది ఒకపూట భోజనంతో అల్లాడుతున్నారని అలాంటి వారిని విస్మరించి ధనికుడిని మరింత ధనికుడిగా మార్చేందుకు మోదీజీ పాలన ఉండటం దేశానికి పట్టిన దౌర్భాగ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నారాయణ, కృష్ణయ్య, జంపన్న, భాష్యనాయక్, కృష్ణ, మహేశ్, భువనేశ్వరి, నాగన్న, నాయకులు శివ, గోపాల్, రహీం, జోహెబ్, సీఐటీయూ, సీపీఐ, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
కొత్తకోట పట్టణంలో..
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా భవన నిర్మాణ కార్మికులు సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని, భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం నిధులను పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో కార్మికులు జనార్దన్, శ్రీను, వెంకటయ్య, నాగరాజు, కురుమూర్తి, వెంకటేశ్, నా రాయణ, రాములు, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్యానాయక్, సీఐటీయూ జిల్లా నాయకుడు దేవేందర్ అన్నారు. సమ్మెలో భాగంగా సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మండలకేంద్రంతోపాటు రేమద్దుల, తెల్లరాళ్లపల్లి, తండాల్లో బైక్ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో లాలునాయక్, జంబులయ్య, భీమయ్య తదితరులు పాల్గొన్నారు.