వనపర్తి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : ఒకప్పుడు వలసలు వెళ్లిన ప్రాంతం, కరువుకు నిలయమైన చోట.. నేడు పచ్చని పంటపొలాలు దర్శనమిస్తున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఎక్కడ చూసినా నీటి వనరులు, పచ్చని అందాలు కనువిందు చేస్తున్నాయి. దీనికితోడు ఆధ్యాత్మిక సౌరభాలు వికసిస్తున్నాయి. ఇక్కడి అందాలు, అభివృద్ధిని చూసిన సినిమా దర్శకులు షూటింగ్లకు అడ్డాగా మార్చుకుంటున్నారు. గతంలో వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్ ఆలయం, సోమశిల ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోల చిత్రాలు, సీరియళ్ల షూటింగ్లు జరిగాయి. కాగా, వనపర్తి జిల్లాకు చెందిన వీజే సాగర్ దర్శకుడిగా ‘ఏ స్టార్ ఈజ్ బార్న్’ పేరుతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రముఖ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇటీవల క్లాప్ కొట్టి ప్రారంభించారు.
సీఆర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్ప్లే, డైలాగ్స్, డైరెక్టర్గా వీజే సాగర్ పనిచేస్తున్నారు. ఈ సినిమాను వనపర్తి, సోమశిల, సింగోటం, జడ్చర్ల, పామాపురం, కొత్తకోట పరిసర ప్రాంతాల్లో 50 రోజులపాటు చిత్రీకరిస్తున్నారు. మార్చి 1న షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను ఈ ఏడాది చివరినాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు. 93 మంది ఆర్టిస్టులతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హీరోగా శివన్, హీరోయిన్లుగా ప్రియాపాల్, నేహ, ఊహ నటిస్తుండగా.., మ్యూజిక్ డైరెక్టర్గా సునీల్ కశ్యప్, కెమెరామెన్గా నళినికాంత్ వ్యవహరిస్తున్నారు. ఇది పూర్తి స్థాయి కమర్షియల్ చిత్రమని, పాలమూరు జిల్లాలో అందాలకు, చారిత్రక కట్టడాలకు కొదవలేదని డైరెక్టర్ తెలిపారు. ముందుగా ప్లాన్ ప్రకారం ఇక్కడ షూటింగ్ చేస్తున్నామని ఇక్కడి వ్యక్తిగా పాలమూరు ప్రాంతాలపై అవగాహన ఉందన్నారు. ఇక్కడ షూటింగ్ చేస్తే స్థానికులకు, లోకల్ ఆర్టిస్టులకు ఉపాధి, అవకాశం లభిస్తుందన్నారు.