ఆత్మకూరు, మార్చి 1: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. శివుడికి అత్యంత ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు మంగళవారం నిర్వహించుకున్నారు. తెల్లవారుజామునుంచే భక్తులు ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో శివలింగాలను అభిషేకించి పూజించారు. పట్టణ చెరువులోని పరమేశ్వరస్వామి ఆలయం, బాలబ్రహ్మేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి, మల్లాపురం, కోట్ల ఆంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో రాత్రి అఖంఢ భజన కార్యక్రమం నిర్వహించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో గాన ప్రతిభ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, విశ్వగురు వరల్డ్ రికార్డ్, తెలుగు బుక్ఆఫ్ రికార్డ్, ఇండియన్ ఐకాన్ వంటి 149 అవార్డులు పొందిన డాక్టర్ దీక్షితుల సుబ్రహ్మణ్యం గారితో భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.
పాన్గల్ మండలంలో..
మహాశివరాత్రి సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లోని శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు భక్తులు సోమశిల, శ్రీశైలం, బీచుపల్లి తదితర ఆలయాలకు తరలివెళ్లారు.
లింమయ్యకు అభిషేకాలు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దగూడెం గ్రామక్రాస్ రోడ్డు వద్ద ఉన్న శివాలయం, కడుకుంట్ల, కిష్టగిరి, సవాయిగూడెంలో, అంకూర్, రాజపేట, చిట్యాల, అచ్యుతాపురం, చిమనగుంటపల్లి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలోని శివాలయాల్లో భక్తులు లింగానికి అభిషేకాలు చేశారు.
మదనాపురం మండలంలో..
శివరాత్రి పర్వదినం సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లోని శివాలయాలు శివనామ స్మరణతో మార్మోగాయి. మండలకేంద్రంలోని శివాలయంలో ఎంపీపీ దంపతులు పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో విశిష్ట పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అనంతరం 16మంది శివస్వాములు ఆలయ ప్రధాన అర్చకుడు గోపిస్వామి ఆధ్వర్యంలో మెట్లపూజ చేసి ఇరుముడి కట్టుకొని శ్రీశైలానికి తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ దంపతులు పద్మావతి వెంకట్ నారాయణ, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు బాలకృష్ణ, రాములు, బాలరాజు, మన్యం యాదవ్, శివస్వాములు కుర్మయ్యస్వామి, చంద్రయ్యస్వామి, సురేశ్కుమార్, వెంకటేశ్, శివ, నవీన్, ప్రవీణ్, విష్ణు, యాది, బ్రహ్మయ్య, డి.కుర్మయ్య, పరశురాం, మహేశ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
శైవాలయాలకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు ఉపవాస దీక్షలతో శైవాలయాలకు పోటెత్తారు. జిల్లాకేంద్రంలోని లక్ష్మీగణపతి ఆలయం, రామాలయం, చింతల హనుమాన్, శ్వేతనగర్లోని శివాలయాల్లో స్వామివారికి ఉదయం 5 గంటల నుంచి పంచామృతాభిషేకాలు చేశారు. ఉదయం 5 నుంచి 8 గంటల వరకు లఘు అభిషేకాలు నిర్వహించారు. రాత్రి 10 గంటలకు మహాన్నాసపూర్వక రుద్రాభిషేకం, 12 గంటలకు అభిషేకం, విశేష పంచామృతాభిషేకాలు, ఒంటిగంటకు కల్యాణం, 3 గంటలకు పల్లకీసేవ నిర్వహించారు. పూజల్లో ఆలయ పూజారులు నరేంద్రాచార్యులు, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఆలయ సభ్యుడు విశ్వనాథం, భక్తులు పాల్గొన్నారు.
శివాలయాల్లో భక్తుల రద్దీ
మహాశివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం మండలంలోని నందిమల్ల భ్రమరంబా మల్లికార్జునస్వామి ఆలయం, క్రిష్ణంపల్లి రామలింగేశ్వరస్వామి, చంద్రఘడ్ రామాలింగేశ్వరస్వామి ఆలయాలు, మండలకేంద్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నందిమల్ల ఆలయం, చంద్రఘడ్ ఆలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి రాత్రి భజన కార్యక్రమాలు నిర్వహించారు. పూజల్లో సర్పంచులు విజయలక్ష్మి, చెన్నమ్మ, నాగేశ్వర్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
గోపాల్పేట మండలంలో..
మండలకేంద్రంలోని గాజుల కోనే రు శివాలయం, బుద్ధారం గండి శ్రీరామలింగేశ్వరస్వామి, ఏదుల ఎర్రగట్టు శివాలయంలో భక్తులు శివుడికి అభిషే కం, ప్రత్యేక పూజలు చేశారు. బుద్ధారం ఆలయంలో ఆల య ధర్మకర్త తూము హరిచరణ్రెడ్డి ఆధ్వర్యంలో పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరిపించారు. ఉపవాస దీక్షతో భ క్తులు రాత్రి వేళ ఆలయాల్లో భజనలు చేశారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేశారు. జెడ్పీటీసీ భార్గవి, ఎంపీపీ సంధ్య ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పూజల్లో పాల్గొన్న మంత్రి దంపతులు
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్ని ఆలయాల్లో మంగళవారం శివనామస్మరణ మార్మోగింది. ప్రజలు శివాలయాల్లో లింగాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తడంతో ఆలయాలు కిటకిటలాడాయి. మండలకేంద్రంలోని వీరభద్రస్వామి ఆలయంలో కమ్మరి గోపి ఆధ్వర్యంలో నిర్వహించిన శివపారర్వతుల కల్యాణోత్సవంలో మంత్రి నిరంజన్రెడ్డి, వాసంతి దంపతులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో మంత్రి దంపతులు పాల్గొని భోజనం చేశారు. ఎంపీపీ కృష్ణనాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, సింగిల్విండో ఉపాధ్యక్షుడు రాజు, కార్మికసంఘం జిల్లా అధ్యక్షుడు విక్రమ్, నాయకులు బాల్రెడ్డి, కృష్ణయ్యగౌడ్, వెంకటేశ్, భూమయ్య తదితరులు ఉన్నారు.