వనపర్తి : దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నూతన పింఛన్ కార్డులు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా పింఛన్లు రూ.2016, రూ.3016 ఇవ్వడం లేదన్నారు. కేవలం తెలంగాణలో మాత్రమే ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు దేవరకద్ర నియోజకవర్గంలో కొత్తగా 47 వేల పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. వాటిలో కొత్తకోట మండలానికి 1,075 మదనాపురం మండలానికి 828 పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
అలాగే 29 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు తమ తగ్గర అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ ,మున్సిపల్ చైర్మన్ సుకేశిని విశ్వేశ్వర్, జడ్పీటీసీ కృష్ణయ్య, ఎంపీపీ పద్మావతమ్మ, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, రైతు సమితి అధ్యక్షుడు కొండారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.