వనపర్తి, మార్చి 1 : చేపలు, మాంసం కావాలంటే వనపర్తి జిల్లాకేంద్రం వాసులు మారెమ్మకుంట, మర్రికుంటకు వెళ్లక తప్పదు. కూరగాయల కోసం కమాన్ చౌరస్తాకు పరుగెత్తాలి. అన్నీ ఒకేచోట దొరకవు. ప్రజలకు ఈ కష్టాలు దూరం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. సమీకృత మార్కెట్ ఏర్పాటుకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. గతేడాది మే 3వ తేదీన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు రూ.19.50 కోట్లతో శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మార్కెట్ పనులు 65 శాతం పూర్తి కాగా.. మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.
గతంలో వనపర్తి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు జరిగేవి. వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్రెడ్డి బాధ్యతలు చేపట్టడం.., సీఎం కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు కావడంతో అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అన్న రీతిగా ముందుకు సాగుతున్నారు. పనికి రాదు అన్న స్థలాన్ని సైతం వినియోగంలోకి తీసుకొస్తున్నారు. వనపర్తి మండలం చిట్యాల సమీపంలో రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ను అన్ని హంగులతో నిర్మించారు. పాత మార్కెట్యార్డు స్థలాన్ని ప్రజల కోసం వినియోగించాలన్న లక్ష్యంతో నూతన సమీకృత మార్కెట్ నిర్మాణానికి పూనుకున్నారు. ముందుగా ఉన్న పాత భవనాన్ని పూర్తిగా తొలగించి.. ఎకరన్నర స్థలంలో రూ.19.50 కోట్లతో మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాజీవ్ చౌరస్తా నుంచి మొదలుకొని కొత్తకోట రోడ్డు, పెబ్బేరు రోడ్డు, కొత్త కాలనీలు, కలెక్టరేట్ వరకు ప్రజలకు అందుబాటులో ఉండేలా పనులు చేపడుతున్నారు.
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని..
భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమీకృత మార్కెట్ను నిర్మిస్తున్నారు. ఈ మార్కెట్ ద్వారా వెజ్, నాన్వెజ్ అన్నీ ఒకే చోట దొరకనున్నాయి. మార్కెట్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. పిల్లల పార్కు, బ్యాంకు, పార్కింగ్ వంటివి సైతం ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం దాదాపు 65 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ నెల చివరి వరకు మిగిలిన పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.
– స్వరణ్ సింగ్, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, వనపర్తి
కార్పొరేట్ తరహాలో..
సమీకృత మార్కెట్ను 85 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రెండస్తుల్లో నిర్మిస్తున్నా రు. మొదటి అంతస్తులో వెజ్, నాన్వెజ్కు సంబంధించిన వ్యాపార సముదాయాలు, రెండో అంతస్తులో కొన్ని షాపులు ఏర్పాటు చేయనున్నారు. రెండు అంతస్తుల్లో కలిపి 120 వ్యాపార దుకాణాలు, ఒక సూపర్ మార్కెట్, చిల్డ్రన్ పార్క్, 24 నాన్ వెజ్, పండ్ల దుకాణాలు ఉండేలా పనులు చేపడుతున్నారు. దీంతోపాటు మార్కెట్కు రెండు వైపులా పావు ఎకరా లో పార్కింగ్, వెయ్యి గజాల్లో పిల్లల పార్కు, మార్కెట్ చుట్టూ 30 ఫీట్ల రోడ్డును వేస్తున్నారు. వీటితోపాటు మొదటి అంతస్తులో చిన్నపాటి ఫంక్షన్హాల్, ఒక బ్యాం కు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్పొరే ట్ తరహాలో తీర్చిదిద్దుతున్నారు. మార్కెట్ పనులను మంత్రి నిరంజన్రెడ్డి వారానికోసారి పర్యవేక్షిస్తున్నారు. నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్లకు సూచనలిస్తున్నారు.