ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండేది. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు
వినియోగించుకోలేని దుస్థితి. గత పాలకులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న
చందంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత డెవలప్మెంట్కు కేరాఫ్గా మారింది. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడి హోదాలో నియోజకవర్గ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో కాల్వలను తవ్వించి ప్రతి ఎకరాకూ సాగునీటిని అందించారు. నీళ్ల నిరంజనుడిగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో ఎన్నో కష్టనష్టాలకోర్చి వనపర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. లిఫ్ట్లు, ఏదుల రిజర్వాయర్, వ్యవసాయ గోదాంలు, రోడ్ల విస్తరణ, జేఎన్టీయూ, మత్స్య, నర్సింగ్, మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయించారు. సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి పడిన కష్టాన్నంతా ప్రజలకు వివరించాలని డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రతి గ్రామంలోనూ బీఆర్ఎస్ నాయకులు దృశ్యరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. కండ్లకు కట్టినట్లు వివరిస్తుండడం తో ప్రజలంతా ప్రశంసలు గుప్పిస్తున్నారు.
వనపర్తి, జూలై 2 : ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. గత పాలకులు వనపర్తిలో రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చారే తప్పా.. ప్రజల అభివృద్ధిని విస్మరించారు. స్వరాష్ట్రం సిద్ధించాక ఎన్నికల్లో సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహం చెందకుండా సీఎం కేసీఆర్తో ఉద్యమకాలంలో ఉన్న చనువుతో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. స్వల్ప మెజార్టీతో ఓడించగా ప్రజల నిర్ణయాన్ని ఆయన స్వాగతించినట్లు పలు సందర్భాల్లో నిరంజన్రెడ్డి చెబుతూ.. 24 గంటలు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగారు.
గత పాలకులు వనపర్తిని అంతంత మాత్రంగానే అభివృద్ధి చేశారు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలే కాని ఎంత కష్టమైనా.. పరిష్కార మార్గం కూడా ఉంటుందనే విశ్వాసంతో మంత్రి నిరంజన్రెడ్డి అభివృద్ధే ధ్యేయంగా నిరంతరం పని చేస్తూ ప్రజలందరి చేత మన్నలను పొందుతున్నారు. ఈ అభివృద్ధిని అందరికీ వివరించాలనే ఉద్దేశంతో డ్యాకుమెంటరీకీ శ్రీకారం చుట్టారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గ పరిధిలో ప్రతి అంశాన్ని వివరిస్తూ.. అభివృద్ధి పనులు, దాని వెనకున్న కష్టాన్ని డ్యాకుమెంటరీలో పొందుపర్చి ప్రదర్శించారు. వనపర్తి.. నియోజకవర్గం నుంచి జిల్లా కేంద్రంగా ఏర్పాటు, రోడ్ల విస్తరణ మొదలుకుని బీడు బారిన భూములకు సాగు నీరు, తాగునీరు, చెరువుల అభివృద్ధి, పునరుద్ధరణ, ఏదుల రిజర్వాయర్, సీఎం సహాయనిధి చెక్కులు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మెడికల్, వ్యవసాయ, జేఎన్టీయూ, నర్సింగ్, మత్స్య కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనం ఇలా ప్రభుత్వం నుంచి సాధించిన ప్రగతిని చూపించారు. అదేవిధంగా నాడు ఉమ్మడి పాలనలో ప్రజల సాగు, తాగునీరు లేక వలసలు వెళ్లిన వారు తిరిగి రాగా వారందరినీ కలిసి వారి మాటలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై ప్రజలు చెప్పిన అనుభవాలను డ్యాకుమెంటరీలో పొందుపర్చారు. ప్రతి పని వెనుక పడిన కష్టాన్ని మంత్రి మాటల్లో అందులో వివరించారు.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరూ చూడాలన్న ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనాల సందర్భంలో.. చెరువుల పండుగ రోజున, అన్ని గ్రామాల్లో డ్యాకుమెంటరీని ప్రదర్శించగా.. ఇప్పటికీ కొనసాగుతున్నది. దాదాపు గంటపాటు ఉన్న డ్యాకుమెంటరీని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొన్ని గ్రామాలు, పట్టణంలోని వార్డులు, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో కార్యకర్తలు, నాయకులు, ప్రజలతో కలిసి మంత్రి నిరంజన్రెడ్డి వీక్షించారు. డ్యాకుమెంటరీని చూసిన ప్రజలు ఇంత అభివృద్ధి చేయడానికి మంత్రి పడిన కష్టాన్ని ప్రజలు గుర్తిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాకు ముగ్గురు పిల్లలు. మొదటి కూతురు శిరీషకు పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకున్నాం. చెక్కు వచ్చిందని మంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేసిండ్రు. ఆఫీసుకు వెళ్లినప్పుడు మంత్రి చెక్కులు ఇచ్చి మా అందరికీ బువ్వ పెట్టి, అందరితో కలిసి తిన్నడు. అప్పుడు శానా ఆనందంగా అనిపించింది.
– కావలి చెన్నమ్మ , పొల్కెపహాడు గ్రామం, గోపాల్పేట మండలం
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ముఖచిత్రం ఈ డ్యాకుమెంటరీ. ఇది వాస్తవ అభివృద్ధిని చూపిస్తూ ప్రతిపక్షాలను నివ్వెరపోయేలా చేస్తున్నది. గత పరిస్థితులను వివరిస్తూ ప్రస్తుతం జరిగిన అభివృద్ధిని చూపిస్తూ మంత్రి నిరంజన్రెడ్డి విజయాన్ని అందరి మనసులకు హత్తుకునేలా ఉంది.
– గట్టు యాదవ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
అభివృద్ధిపై తీసిన డ్యాకుమెంటరీ చాలా బాగుంది. ప్రతి అంశాన్ని అర్థమయ్యేలా వివరించారు. మండలం, గ్రామంలో ఇదివరకు చేసిన, మంత్రి నిరంజన్రెడ్డి చేసిన అభివృద్ధిని మాలాంటోళ్లకు అర్థమయ్యేలా తీసిండ్రు. అప్పటి నాయకులు ఏం చేశారు? గిప్పుడు మంత్రి నిరంజన్రెడ్డి ఏం చేసిండో పూర్తిగా అర్థమయ్యింది. తెలంగాణ సర్కార్లో మంత్రి వనపర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ప్రస్థానం డ్యాకుమెంటరీ ద్వారా కండ్లకు కట్టినట్లు చూపించారు.
– కోర్పాల గోపాల్, గౌరిదేవిపల్లి, రేవల్లి మండలం
గతంలో ప్రజలు కరువుతో అల్లాడిండ్రు. ఊర్లకు ఊళ్లు ఖాళీ అయ్యే పరిస్థితి. పక్కపోంటి కల్వకుర్తి కాలువలు ఉన్నా అందులో నీళ్లు లేక అవస్థలు పడ్డాం. పొలాలు నెర్రెలు బారినై. ఈ ప్రాంతానికి మంత్రి నిరంజన్రెడ్డి వచ్చినంక ప్రాజెక్టులు పూర్తి చేసి అదే కాలువల ద్వారా నెర్రెలు బారిన భూములకు నీళ్లు పారించిండు. పొలాలను సాగులోకి తీసుకొచ్చిండు. అంతేకాక సీఎం కేసీఆర్ ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందించడం వల్ల నాడు దండుగ అన్న వ్యవసాయం నేడు పండుగలా మారింది.
– మల్లెపల్లి బాలీశ్వర్ రెడ్డి, రేవల్లి మండలం