నాగర్కర్నూల్, మార్చి 19(నమస్తే తెలంగాణ): రెండు దశాబ్దాల కల నెరవేరింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమాన పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్న సెర్ప్ ఉద్యోగుల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఏప్రిల్ 1నుంచి పెరిగిన పేస్కేల్ వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం విశేషం. దీంతో వేలాదిమంది సెర్ప్ ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖలో పనిచేస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లభించింది. 23ఏండ్లుగా డీఆర్డీవో శాఖలో డ్రైవర్లు, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్డినేటర్ల నుంచి కమ్యూనిటీ కోఆర్డినేటర్లు, మండల బుక్ కీపర్లు, డీపీఎంలు, ఏపీఎంలుగా వివిధ హోదాలో పనిచేస్తున్నారు.
ప్రభుత్వం వివిధ పథకాలను అమలుచేయడంలో ఈ ఉద్యోగుల పాత్ర కీలకం. గ్రామస్థాయిలో అమలయ్యే ఈ పథకాలతో పేదల జీవన ప్రమాణాల్లో గుణాత్మక మార్పు రావడంలో వారు కీలక భూమిక పోషిస్తున్నారు. 2002లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో తాత్కాలిక పద్ధతిలో విధుల్లో చేరారు. అప్పటి నుంచి తమకు అప్పగించిన విధులను వందశాతం నెరవేరుస్తూ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేలా పనిచేస్తున్నారు.
అయితే ఈ ఉద్యోగులు దశాబ్దానికిపైగా పేస్కేల్ కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాక ముందు నుంచి కోరుతున్నా పట్టించుకోలేదు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్ సెర్ఫ్ ఉద్యోగుల న్యాయమైన ఆకాంక్షను గుర్తించారు. ప్రతిరోజూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగానూ ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారి శ్రమను గుర్తించిన సీఎం కేసీఆర్ పేస్కేల్ అమలు చేసేలా గ్రామీణాభివృద్ధిశాఖకు ఆదేశించారు.
ఈ క్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం జీవో 11ద్వారా ఉత్తర్వులు విడుదల చేశారు. దీంతో వేలాదిమంది ఉద్యోగులకు ఏప్రిల్ నుంచి పేస్కేల్ అమలు కానున్నది. కనిష్టంగా రూ.19వేల నుంచి రూ.58వేలకు, గరిష్టంగా రూ.51వేల నుంచి రూ.1.27లక్షలకు చేరుకోవడం విశేషం. దీనిద్వారా కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు జూనియర్ అసిస్టెంట్ హోదాతో, ప్రాజెక్టు మేనేజర్లకు ఎంపీడీవో హోదాతో వేతనం వర్తించనున్నది. అదేవిధంగా డీఏ కూడా వర్తించనున్నది. పేస్కేల్ పెరగడంతో సెర్ప్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించనున్నది.
ఉద్యోగుల కుటుంబాల్లో ఉద్యోగంపై విశ్వాసం పెంచనున్నది. ఆర్థిక చేయూత పెరిగి కుటుంబాల్లో స్థిరత్వం ఏర్పర్చనున్నది. మహిళా సంఘాలను బలోపేతం చేయడంలో ఈ ఉద్యోగులు నిరంతరం పనిచేస్తు న్నారు. వారి న్యాయమైన ఆకాంక్షను తీరుస్తానని గతంలో అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇలా సీఎం నిర్ణయం అమలు కానుండటంతో సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నాగర్కర్నూల్ జిల్లాలో 129సెర్ప్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఇందులో అడిషనల్ డీఆర్డీవోలు ఒకరు, డీపీఎంలు ఆరుగురు, ఏపీఎంలు 27మంది, సీసీలు 78మంది, ఎంఎస్సీసీలు 12మంది, అడ్మిన్ అసిస్టెంట్లు నలుగురు, డ్రైవర్ చొప్పున 129మందికి ప్రయోజనం కలగనున్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
మాకు కూడా పేస్కేల్ అమలుచేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. 20ఏండ్లకుపైగా పేస్కేల్ కోసం ఎదురుచూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నాం. మా ఆకాంక్షను నెరవేర్చినందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు
– శ్రీనివాసులు, డీపీఎం
మాట నిలబెట్టుకున్న సీఎం
సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో సెర్ప్ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ పేస్కేల్ అమలు చేయడంతో మా కుటుంబాల్లో సంతోషాలు నెలకొన్నాయి. వేతనాలు పెరిగితే ఆర్థికంగా సమాజంలో మంచిగా స్థిరపడుతాం.
– నిరంజన్, ఏపీఎం