వనపర్తి అర్బన్, ఆగస్టు 6 : గర్భిణులు, చిన్నారుల కోసం వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలంటే ఇప్పటివరకు దగ్గరలోని ఆరోగ్యకేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. కాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాధి నిరోధక టీకాల పంపిణీని పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తూ యూ-విన్ పోర్టల్ యాప్ను తీసుకొచ్చింది. దీంతో టీకా ఏ రోజు తీసుకోవాలో ఈ యాప్ ద్వారా బాధితుల ఫొన్కు ముందే సమాచారం వస్తుంది. గతంలో కరోనా వచ్చిన సమయంలో కోవిన్ పోర్టల్ మాదిరిగానే ఈ పోర్టల్ పనిచేస్తుంది. దీని ద్వారా ప్రతి గ్రామంలో గర్భిణులు, చిన్నారులకు వందశాతం వ్యాక్సినేషన్ అందించే అవకాశం ఉంటుందని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.
వ్యాక్సినేషన్ వివరాలు నమోదు
యూ-విన్ పోర్టల్ ద్వారా ప్రతి గర్భిణి, చిన్నారి వివరాలను డిజిటలైజేషన్ చేస్తారు. దీంతో వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం టీకా ఇచ్చేలా కుటుంబసభ్యులకు ఈ పోర్టల్ ద్వారా ముందే సమాచారం వస్తుంది. బాధితులు టీకా తీసుకొనే సమయం మర్చిపోయినా పోర్టల్ ద్వారా వచ్చే సమాచారంతో సరైన సమయంలో తీసుకోవచ్చు. డిజిటలైజేషన్ ద్వారా దేశం, రాష్ట్రంలో ఎక్కడ ఉన్న సమీపంలోని ఆరోగ్యకేంద్రంలో టీకా వేయించుకోవచ్చు. టీకా తీసుకున్నాక ఈ పోర్టల్ ద్వారా సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
12 వరకు వ్యాక్సినేషన్
తెలంగాణ ప్రభుత్వం ఇన్టెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా గర్భిణులు, ఐదేండ్లలోపు చిన్నారులకు గతంలో అంగన్వాడీ సెంటర్, ప్రభుత్వ దవఖానల్లో 12 రకాల టీకాలను ఉచితంగా వేసేవారు. టీకా వేసిన అనంతరం వీరి వివరాలను యూ-విన్ పోర్టల్లో డిజిటలైజేషన్ చేస్తారు. బాధితులు వ్యాక్సినేషన్ కోసం తమ ఆండ్రాయిడ్ ఫోన్లో యూ-విన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, వారి వివరాలను నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించనున్నట్లు వైద్యాధికారుల సమాచారం. జిల్లాలో హైరిస్క్ ఏరియా, ఇటుక బట్టీలు, సంచార జాతుల గుడిసెల వద్ద ఈ టీకాలను తప్పకుండా వేయాలని ఆదేశాలను ప్రభుత్వం ఆదేశించింది. వ్యాక్సినేషన్ సోమవారం నుంచి 12వ తేదీ వరకు మొదటి రౌండ్, సెప్టెంబర్ 11 నుంచి 16వ తేదీ వరకు, అక్టోబర్ 9 నుంచి 14వ తేదీ వరకు మూడో రౌండ్లో గర్భిణులు, చిన్నారులకు వ్యాక్సిన్ వేస్తారు.
సిబ్బందికి శిక్షణ పూర్తి..
యూ-విన్ పోర్టల్లో గర్భిణులు, చిన్నారుల వివరాల నమోదుపై సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు డబ్ల్యూహెచ్వో ప్రతినిధులు శిక్షణ ఇచ్చారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న వ్యాక్సినేషన్లో గర్భిణులు, చిన్నారుల వివరాలను నమోదు చేసేలా ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 1,114మంది, గర్భిణులు 351 మంది ఉన్నారు. వీరందరికీ వందశాతం వ్యాక్సిన్ వేస్తాం. ఈ టీకాలు వేయడం వల్ల వ్యాధుల నుంచి ముందస్తుగా కాపాడుకోవచ్చు. టీకా తీసుకున్న తర్వాత దుష్పరిణామాలను పరిశీలించడానికి అరగంట వేచి ఉండేలా వసతులు కల్పించాం. – రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి జిల్లా