మహబూబ్నగర్, మెట్టుగడ్డ, జూలై 11 : సరదాగా గ్రామ సమీపంలోని నీటి గుంతలో ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా హన్వా డ మండలం చిన్నదర్పల్లిలో చోటు చేసుకున్నది. హన్వాడ ఎస్సై రవినాయక్ కథనం మేరకు మహబూబ్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదర్పల్లికి చెందిన శివ (9), గణేశ్ (9) నాలుగో తరగతి చదువుతున్నారు.
అయితే మంగళవారం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఇంటి వద్దే ఉన్న ఇద్ద రు కలిసి గ్రామ సమీపంలోని నీటి గుంత వద్దకు సరదాగా ఈత కొట్టడానికి వెళ్లాడు. నీటిలోకి దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోయారు. కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి చూసే వరకు విగతజీవులుగా మారారు. మృతదేహాలను బయటకు తీయగా కుటుంబ సభ్యులు రోధనలు మిన్నంటాయి. పండుగ పూట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.