కొల్లాపూర్, ఏప్రిల్ 7 : మత్స్యకార వృత్తిపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న ది. ఇందులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్లో గత నవంబర్, డిసెంబర్ నెలల్లో చేపపిల్లలను విడుదల చేసింది. అయితే, ఆ చేప పిల్లలను ఎదగనీయకుండా, పునరుత్పత్తి జరగనీయకుండా నిషేధిత అలవి వలలను ఉపయోగిం చి ఆంధ్ర జాలర్ల సాయంతో సంపదనంతా దోచేస్తున్నారు.
దీంతో చేప పిల్లలను వదులుతున్నా.. లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. జూన్ నుంచి ఫిబ్రవరి వరకు శ్రీశైలం ప్రాజెక్ట్లో వెనుక జలా లు నిల్వ ఉంటాయి. ఈ సమయంలో చేపల ఉ త్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏటా మత్స్యశాఖ అధికారులు లక్షల సంఖ్యలో ఉచిత చేప పిల్లలను నదిలో విడుదల చేస్తున్నా రు. కొల్లాపూర్ నియోజకవర్గంలో కృష్ణానది తీరం వెంట గడ్డబస్వాపూర్ నుంచి పాతాళగంగ వరకు సుమారు 120 ఆంధ్రా జాలర్ల కుటుంబాలు తాత్కాలిక ఆవాసాలను ఏర్పాటు చేసుకొ ని జీవనం సాగిస్తున్నారు.
వీరికి మత్స్య మా ఫియా బయానా ఇచ్చి తమ ఆధీనంలో ఉంచుకుంటున్నారు. జాలర్లు పట్టిన చేపలను కిలోకు రూ.50 నుంచి రూ.60 చొప్పున మాఫియా కొనుగోలు చేస్తున్నది. దీంతో జాలర్లు ఇటు ధర, అటు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. మాఫియా చేతుల్లో ఆంధ్రా జాలర్లు దశాబ్దాలుగా మోసపోతున్నారు. ఇలా తమ బతుకు ‘నావా’ నడుపుతున్నారు. కృష్ణానదిలో నీటి మట్టం తగ్గడంతో పెద్దమారూర్, మంచాలకట్ట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి, చీమలతిప్ప, కోతిగుండు, వేములపాయ, పాతాళగంగ వరకు నదీతీరం వెంట నిషేధిత అలవి వలలతో మత్స్యసంపదను కొల్లగొడుతున్నారు.
పౌల్ట్రీ ఫాంలకు ఎండు చేపలు..
ఏటా మత్స్యమాఫియా రూ.కోట్లల్లో దోచుకుంటున్నది. అలవి వలలను ఒక్కసారి వేస్తే 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు చిన్న చేపపిల్లలతో సహా చిక్కుతాయి. చిన్న చేపలను నదీ తీర ప్రాంతంలోనే ఎండబెట్టి.. బస్తాల్లో నింపి ఏపీలోని విజయవాడ, గుంటూరు, తెలంగాణలోని కోదాడ, మిర్యాలగూడ, సూర్యాపేట ప్రాంతాల్లోని పౌల్ట్రీఫాంలకు కిలో రూ.300 చొ ప్పున రాత్రివేళ అక్రమంగా రవాణా చేస్తున్నా రు.
ఇలా ఏటా ఎండు చేపలను తరలిస్తూ రూ. కోట్లల్లో దందా చేస్తున్నారు. ఈ వ్యాపారం మూ డు పువ్వులు, ఆరుకాయాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. వేసవిలో నీటిమట్టం తగ్గడంతో ఆంధ్రా జాలర్ల చేత నిషేధిత వలలను ఉపయోగించి చేప గుడ్డుతో సహా ఊడ్చేస్తున్నారు. ఇలా మత్స్య మాఫియా దోచుకున్న డబ్బుతో కొల్లాపూర్లో భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అయినా, సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
దాడుల సమాచారం ముందస్తుగా చేరవేత..
మత్స్యకారులకు జీవనోపాధి కల్పించడంలో భాగంగా కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రవహిస్తున్న కృష్ణానదిలో సుమారు 56 లక్షల చేపపిల్లలను వదిలారు. వాటిని విడిచిపెట్టిన నెల రో జుల వ్యవధిలోనే చేపల వేట కొనసాగిస్తున్నా రు. ఈ దోపిడీని నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలున్నా యి. ఆరు నెలల కిందట అమరగిరి ప్రాంతంలో పోలీసుల సాయంతో మత్స్యశాఖ అధికారులు మొక్కుబడిగా దాడులు చేసి.. అమరగిరికి చెందిన చేపల వ్యాపారుల నుంచి ఒకటో, రెండో అలవి వలలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, మత్స్య మాఫియాకు దాడుల విషయం ముందస్తుగానే తెలుస్తున్నది. నదీతీరం వెంట పర్యవేక్షణ చేసే మత్స్యశాఖ సిబ్బందే సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తెలిసింది. నెలకో, రెండు నెలలకోసారి పర్యవేక్షించే సిబ్బంది మామూళ్ల మత్తులో జోగుతున్నారని అభియోగాలున్నాయి. ఈ తతంగం దశాబ్ద కాలంగా కొనసాగుతూనే ఉన్నది. ఈ మాఫియా దందాను నియంత్రించాలని స్థానిక మత్స్యకారులు కోరుతున్నారు.
దాడులు చేస్తాం..
కొల్లాపూర్ ప్రాంతంలోని కృష్ణానది పరీవాహక ప్రాంతంలో నిషేధిత అలవి వలలతో చేప పిల్లలను పడుతున్నారని, ఎండబెట్టి పౌల్ట్రీఫాంలకు ఎగుమతి చేస్తున్నట్లు తమకు సమాచారం లేదు. సిబ్బందిని అక్కడికి పంపించి దాడులు చేయిస్తాం. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అలవి వలలతో చేపల దందా చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. చట్టపరంగా కేసులు నమోదు చేస్తాం.
– లక్ష్మప్ప, మత్స్యశాఖ జిల్లా అధికారి, నాగర్కర్నూల్