ఊట్కూర్(కృష్ణ) : స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన బాలుడు ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన పెళ్లింట( Wedding ) విషాదం నెలకొంది. నారాయణపేట( Narayanapet ) జిల్లా కృష్ణ మండలం గుడెబల్లూరు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన చెరువు కట్ట అశోక్ పెళ్లి సోమవారం జరగాల్సి ఉండగా మహారాష్ట్ర సోలాపూర్ పట్టణం నుంచి బంధువులు రెండు రోజుల క్రితం గ్రామానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి సందడి లో ఉండగా తన్మై (13) సంవత్సరాల బాలుడు స్నేహితులతో కలిసి ఊరి శివారులో ఉన్న వ్యవసాయ బావి దగ్గరకు ఈతకు వెళ్లాడు. బాలుడికి ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరి ఆడక చనిపోయినట్లు బంధువులు తెలిపారు.
బాలుడు మృతి చెందిన సంఘటనతో పెళ్లి భాజాలతో కళకళలాడాల్సిన పెళ్లి పందిరి మూగబోయింది. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కాగా బాధిత కుటుంబ సభ్యులు బాలుడి శవంతో సోలాపూర్ పట్టణానికి తిరుగు ప్రయాణం అయినట్లు సమాచారం .