మహబూబ్నగర్, సెప్టెంబర్ 3 : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి 7గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో రాత్రంతా కుండపోతగా కురిసింది. మూసాపేటలో 14.5 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు కాగా, వనపర్తి జిల్లా పాన్గల్ మండలంలో అత్యల్పంగా 0.14 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండాయి. నెల రోజులుగా వర్షాలు కురువకపోవడంతో దిగాలు చెందిన రైతులకు ఈ వర్షం కొంత ఊరటనిచ్చింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాతబస్టాండ్ సమీపంలో గాలికి చెట్టు విరిగిపోయి రోడ్డుపై పడింది. ఖిల్లాఘణపూరం మండలంలో 1.2 సెం.మీ., వనపర్తిలో 1 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దమందడి మండలంలో 58 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ఉధృతంగా ప్రవహిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసింది. ఇటిక్యాల మండలం మానవపాడులో 21.3 మి.మీ., అత్యల్పంగా గట్టు మండలంలో 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో 110 మి.మీ., వంగూర్ మండలంలో 78.0 మి.మీ., వెల్దండలో 7.86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చొక్కన్నపల్లిలో భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లింగాల మండలంలో 8.6 మి.మీ. అత్యల్పంగా వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలో 67.6 మి.మీ., ధన్వాడ మండలంలో 70 మి.మీ., గుండుమాల్ 48.4 మి.మీ., కొత్తపల్లిలో 48.0 మి.మీ., నారాయణపేట మండలంలో 41.4 మి.మీ., అత్యల్పంగా మంగనూర్లో 9.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దామరగిద్ద మండలంలోని ఉడ్మల్గిద్దలో గ్రామానికి చెందిన రైతు పెద్దింటి బాలప్ప కాడెద్దులు పిడుగుపాటుకు మృతిచెందాయి. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మూసాపేట మండలంలో అత్యధికంగా 145.8 మి.మీ., అత్యల్పంగా కోయిల్కోండ మండలంలో 31.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మిడ్జిల్ మండలంలో 56.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. మండలంలోని వెలుగొమ్ముల దుందుభీ వాగు అలుగు పారింది. భూత్పూర్ మండలం వెల్కిచర్ల శేరికుంట చెరువు అలుగు పారింది.