బాలానగర్/మిడ్జిల్/కొత్తకోట, ఆగస్టు 18 : చరిత్రను కండ్లకు కట్టినట్లు సజీవంగా చూపేదేదైనా ఉందంటే అది ఒక్క ఫొటోగ్రఫీ మాత్రమే.. మన ముందు తరాలవారు, ఆ ముందు తరాల వారు ఎలా ఉన్నారనడానికి సాక్ష్యం ఈ ఫొటోలే. ఫోటో ఒక జీవం లేని సాక్ష్యం. చాలా సందర్భాల్లో ఫొటోలు ఎన్నో సాక్ష్యాలుగా నిలబడ్డాయి. ఒక్కప్పుడు కెమెరాలపై నల్లటి బట్టలు వేసి, కెమెరా మూత తీసి ఫొటో తీసే కాలం నుంచి సెల్ఫోన్లోనే ఫొటోలను ఎడిట్ చేసుకునే స్థాయికి టెక్నాలజీ పెరిగిందంటే అతిశయోక్తి కలుగక మానదు. ఎన్నో ఏండ్లు కాంతి తరంగాలు, రేడియో తరంగాలపై పరిశోధనలు చేసి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు తీయడాన్ని డగ్రే కనుగోన్నారు. నేడు కలర్ ఫొటోలు, ఎడిట్ ఫొటోలు, ఇక్కడ దిగిన ఫొటోలు మరెక్కడో దిగినట్లు మార్చుకుంటున్నామంటే అదంతా అయన చలువే. గతంలో శుభకార్యం పెట్టుకుంటే ముందుగా ఫొటోగ్రాఫర్లను బుక్ చేసుకునేవారు. కానీ నేడు టెక్నాలజీ పెరగడంతో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ తప్పా మరే ఇతర శుభకార్యాలకు ఫొటోగ్రాఫర్లను పిలవడం లేదు. చాలామంది సొంత కెమెరాలను తెచ్చి ఫొటోలు తీసుకుంటున్నారంటే టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చిందో ఇట్టే తెలుస్తుంది. చరిత్రను భద్రపరిచి చూపించిన ఫొటోగ్రాఫర్లు నేడు కూటికి లేక విలవిలలాడుతున్న దుస్థితి కనబడుతున్నది.
– బాలానగర్/మిడ్జిల్/కొత్తకోట, ఆగస్టు 18
తొలిసారిగా పారిస్కు చెందిన జోసెఫ్మియాఫ్స్ లోహ పలకంపై దృశ్యాన్ని నిలపగలిగారు. 1839లో మొట్టమొదటి సారిగా సర్జాన్ హెల్లర్ ఫొటోగ్రఫీని ఉపయోగించారు. 1941లో విలియం హెన్రీ అనే వ్యక్తి ఫొటోగ్రఫీకి మూలమైన పాజిటివ్, నెగెటివ్ ఫిల్మ్లను కనుగొన్నారు. మొదట సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఫొటోలను కడిగేవారు. కాలక్రమేనా విద్యుచ్ఛక్తి ద్వారా ఫొటోలు తీయడం, ప్రింటింగ్ చేయడం మొదలైంది. అప్పట్లో నలుపు, తెలుపు ఫొటోలు అందుబాటులో ఉండేవి. 1980 దశకంలో కలర్ ఫొటోగ్రఫీ అందుబాటులోకి వచ్చింది.
చిన్నప్పుడు ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడి ఈ వృత్తిలోకి వచ్చాను. అప్పట్లో రీల్ కెమెరాలతో ఫొటోలు తీసి రెండురోజుల తరువాత ఇచ్చేవాళ్లం. కానీ టెక్నాలజీ పెరిగాక అందరూ ఫొటోలు తీసుకోవడంతోపాటు వాటిని ఫేస్బుక్, వాట్సాప్లలో పంపించుకుంటూ కడిగించుకోవడమే మానేశారు. ప్రస్తుతం వెడ్డింగ్, అవుట్డోర్ ఫొటో అండ్ వీడియోగ్రఫీ మాత్రమే నడుస్తోంది. ఫొటోగ్రాఫర్లను ప్రభుత్వమే ఆదుకోవాలి.
– రామకృష్ణ, ఫోటోగ్రాఫర్, హేమాజీపూర్
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ఉమ్మడి జిల్లా ఫొటోగ్రాఫర్లను అవార్డులు వరించాయి. 2022 సంవత్సరానికి గానూ మహబూబ్నగర్ నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ బందిగెగోపికి రాష్ట్రస్థాయిలో రెండో బహుమతి వచ్చింది. అలాగే 2023 సంవత్సరానికి గానూ వైద్య విభాగంలో కేటగిరీ-2లో గోపికి కన్సొలేషన్ బహుమతి వచ్చింది. కాగా, వనపర్తి ఫొటోగ్రాఫర్ పి.యాదిరెడ్డిని కళాకారుల విభాగంలో కేటగిరీ-3లో కన్సొలేషన్ బహుమతి వరించింది. నాగర్కర్నూల్ ఫొటోగ్రాఫర్ కపిలవాయి రాజుకు అభివృద్ధి విభాగంలో కేటగిరీ-2లో కన్సొలేషన్ బహుమతి వచ్చింది. వీరికి ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లోని రవీంద్రభారతిలో మంత్రి హరీశ్రావు అవార్డులు అందజేయనున్నారు.