మహబూబ్నగర్ అర్బన్, జూన్ 13 : రక్తదానం మరొకరి జీవితానికి వెలుగు.. రక్తదానం చేయండి-ప్రాణదాతలుకండి.. అంటూ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, వైద్యులు పలు అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. మూడు నెలలకోసారి రక్తదానం చేయడం వల్ల సదరు వ్యక్తి ఆరోగ్యంగా ఉండడంతోపాటు ప్రమాదకర పరిస్థితుల్లో మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారు. రక్తం గ్రూపులు వేరైనా.. రంగు మాత్రం ఒక్కటే.. రక్తదానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఏడాది జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రక్తంలోని ఏ, బీ, ఓ గ్రూపులను కనుగొన్న కార్ల్ స్టెయినర్ జన్మదినం జూన్ 14ను పురస్కరించుకొని ఆ రోజున రక్తదాతల దినోత్సవంగా పాటిస్తున్నారు. రెడ్క్రాస్, రెడ్క్రీసెంట్ సొసైటీ, ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్లు ప్రపంచ ఆరోగ్య సంస్థలతో కలిసి రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందక చనిపోతున్నవారు ఎందరో.. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుంది. దేశంలో ప్రతి రెండు సెకండ్లకు ఒకరికి రక్తం అవసరమవుతుంది. సరైన అవగాహన లేనందున రక్తదానం చేసేవారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. రక్తదాతలు ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపడవచ్చు. ఇటీవల ఆన్లైన్లో దాతల వివరాలు అందుబాటులో ఉంచుతూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చినప్పటికీ.. వీటి గురించి తెలియకపోవడంతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రక్తదానం హానికరం కాదు..
రక్తదానంతో జీవితంలో ఇబ్బందులొస్తాయని చాలామంది భయపడతారు. వాస్తవానికి రక్తం ఇవ్వడం వల్ల సదరు వ్యక్తికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. వైద్యులు పరీక్షలు చేసి పూర్తి ఆరోగ్యవంతులని, సరిపోయినంత రక్తం ఉందని నిర్ధారించుకున్న తరువాతే మన నుంచి రక్తం తీసుకుంటారు, రక్తదానం చేసిన తరువాత ఆరు నుంచి పన్నెండు వారాలలోపు వ్యక్తికి పూర్తిస్థాయిలో కొత్త రక్తం తయారవుతుంది. ఎలాంటి రక్తహీనత సమస్యలు తలెత్తవు.
రక్తదానంతో కలిగే ప్రయోజనాలు..