TS Gurukulam | విద్యా రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గురుకులాలు విద్యార్థుల ఉజ్వల భవితకు బంగారు బాటలు వేస్తున్నాయి. అందుకే ఎందరో విద్యార్థులు పాఠశాల, జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 17 కాలేజీలను మంజూరు చేయగా.. ఉమ్మడి జిల్లాకు మూడు మంజూరు చేశారు. నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే డిగ్రీ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. బీఏ, బీకాం, బీజెడ్సీ కోర్సులతోపాటు కంప్యూటర్ అనుబంధ, ఉపాధి కోర్సులను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సోమవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ మొదలుకానున్నది. ఇంటర్ కళాశాలల్లోనే డిగ్రీ చదివే విద్యార్థులకు సౌకర్యంగా ఉండనున్నది. డిగ్రీ కళాశాలల మంజూరుతో బీసీ వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతున్నది.
నాగర్కర్నూల్, జూన్ 24: బీసీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం నడుం బిగించింది. వెనుకబడిన వర్గాల జీవితాల్లో విద్య ద్వారానే సమూల మార్పును తేవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో మెరుగైన విద్యను అందిస్తున్న నేపథ్యంలో సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాగర్కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. ఇప్పటికే బాలికల విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కస్తూర్బా పాఠశాలలను ఏర్పాటు చేసి అందులోనే ఇంటర్ చదివేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం జ్యోతిబాఫూలే బీసీ గురుకుల కళాశాలల్లోనే డిగ్రీ విద్యను అందించనున్నారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17 బీసీ డిగ్రీ కళాశాలలు మంజూరు కాగా, అందులో ఉమ్మడి జిల్లాకు మూడు కళాశాలున్నాయి. దీంతో బీసీ వర్గాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నచోటే డిగ్రీ చదువుకునే అవకాశం కల్పించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
జిల్లాలో నాగర్కర్నూల్, కల్వకుర్తి పట్టణాల్లో బీసీ గురుకుల జూనియర్ కళాశాలలు కొనసాగుతుండగా వెల్దండ, ఊర్కొండపేట, కోడేరు, సింగోటం, అంబట్పల్లి, వెల్టూరు, తాడూరు, తెలకపల్లి మండలాల్లో బీసీ గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పూర్తి చేసుకున్న దాదాపు 450లకుపైగా విద్యార్థులు ఈ ఏడాది డిగ్రీలో చేరనున్నారు. ఈక్రమంలో ఉన్నచోటే మూడేండ్ల పాటు డిగ్రీ చదువుకునే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. ఫస్టియర్లో 450మంది విద్యార్థులకు డిగ్రీలో సీట్లు దక్కనున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలలు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తరగతులను ప్రారంభిస్తుండడంతో విద్యాభిమానులు హర్షిస్తున్నారు. డిగ్రీలో ఇదివరకు ఉన్న బీఏ, బీకాం, బీజెడ్సీ కోర్సులతోపాటు ఇతర కంప్యూటర్ అనుబంధ విభాగాలు, ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈసారి డిగ్రీ చదివేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక సతమతమవుతున్న వారికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించడంతో విద్యార్థుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గద్వాల, జూన్ 24 : జోగుళాంబ గద్వాల జిల్లాకు ప్రభుత్వం బీసీ గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. కాగా ధరూర్ మండలంలో కళాశాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు కల్పించి తరగతుల ప్రారంభించాలని గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేయడంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలోని పీజీ కళాశాలలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ పల్లయ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
విద్య బలోపేతమే కేసీఆర్ లక్ష్యం
జిల్లాలో వెనుకబడిన బీసీ వర్గాలను విద్యాపరంగా బలోపేతం చేయడ మే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. అందులో భాగంగానే బీసీ డిగ్రీ గురుకుల కళాశాలను మంజూరు చేశారు. ఈ కళాశాలను అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉన్నచోట కొనసాగించి విద్యాభివృద్ధికి కృషి చేస్తాం. గ్రాడ్యుయేట్ విద్యతో బీసీల్లో సమూ ల మార్పులు వస్తాయనే నమ్మకం కలిగింది. సమైక్య పాలనలో నిర్వీర్యమైన విద్యా వ్యవస్థ తెలంగాణ వ చ్చాకే గాడిలో పడింది. కార్పొరేట్కు దీటుగా జి ల్లాలో విద్యా వ్యవస్థ మెరుగుపడింది.
అదృష్టంగా భావిస్తున్నా..
ఇంటర్ చదువుతున్న గురుకులంలోనే డిగ్రీ చేసే అవకాశం రావడం నా అదృష్టం. ఇంటర్ పూర్తికాగానే ఎక్కడ చేరాలోఅనే బెంగ ఉండేది. జిల్లాకు గురుకుల డిగ్రీ కళాశాలను మంజూరు చేయడంతో ఇక్కడే చదువుకునే వీలు కలిగింది. దూర ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటున్న నాకు మరో మూడేండ్లు ఏ ఢోకా లేదు. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– కావ్యశ్రీ, మరికల్, మల్దకల్ మండలం
సోమవారం నుంచి దరఖాస్తులు
ఉమ్మడి జిల్లాలోనే పెద్ద జిల్లా నాగర్కర్నూల్కు బీసీ డిగ్రీ గురుకుల కళాశాల మంజూరు కావ డం ఈప్రాంత విద్యార్థు ల అదృష్టం. మంజూరై న సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలొచ్చా యి. కళాశాల మంజూరై న మొదటి ఏడాదిలోనే బీసీ గురుకులాల్లో విద్యనభ్యసించిన 183 విద్యార్థులకు ఇక్కడే డిగ్రీ సీట్లు కేటాయిస్తాం. బాలబాలికల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని మాకు ఆదేశాలు వచ్చాయి. సోమవారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
– వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్, బీసీ గురుకులం, నాగర్కర్నూల్
మరో మూడేళ్లు ఇక్కడే
బీసీ డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో మరో మూడేళ్లు ఇక్కడే చదువుకుంటా. ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పాఠశాలస్థాయి నుంచి ఇక్కడే చదువుతున్నా. ఇంటర్ తర్వాత కూడా డిగ్రీ ఇక్కడే చదివే అవకాశం రావడం సంతోషంగా ఉంది.
-అశ్విని, ఖిల్లాఘణపూర్