కోడేరు, జూన్ 1 : కలెక్టర్ పీఏనని ఓ వ్యక్తి వివిధ గ్రామాల అంగన్వాడీ టీచర్లకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ సూపర్వైజర్ శోభారాణి కోడేరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ కథనం మేరకు.. వారం రోజులుగా కోడేరు, ఎత్తం, కొండ్రావుపల్లి, జనుంపల్లి, తీగలపల్లి తదితర గ్రామాలకు చెందిన 15 మంది అంగన్వాడీ టీచర్లకు మే 24 నుంచి 9640843790, 9030289300 అనే సెల్ నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తాను జిల్లా కలెక్టర్ పీఏను అంటూ పరిచయం చేసుకొని అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన వివరాలు కావాలని అడిగేవాడు. వివరాలు తెలుసుకున్న తర్వాత దుర్భాషలాడాడు.
అనుమానం వచ్చిన అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్ శోభారాణి, సీడీపీవో వెంకటరమణకు ఫోన్లో సమాచారం అందించారు. స్పందించిన శోభారాణి పోలీసులకు మే 27న ఫిర్యాదు చేశారు. అయినా సదురు వ్యక్తి తిరిగి కోడేరుకు చెందిన ఓ అంగన్వాడీ టీచర్కు ఫోన్ చేసి తిట్ల పురాణం వినిపిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఉదయం, రాత్రి ఫోన్ చేస్తూ బెదిరిస్తుండడంతో అంగన్వాడీ టీచర్లు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు గుర్తించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఐసీడీఎస్ సూపర్వైజర్ శోభారాణిని సంప్రదించగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎస్సై కృష్ణ ఓబుల్రెడ్డిని సంప్రదించగా ఫిర్యాదు చేసిన మాట వాస్తవమే అని, ఫోన్ నెంబర్లను ట్రేస్ చేయిస్తున్నట్లు తెలిపారు.