అచ్చంపేట, అక్టోబర్ 7 : కృష్ణా జలాలను అచ్చంపేట ప్రాంతంలో పారించి ఈ రైతుల పాదాలు కడుగుతానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేటలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అనారోగ్యం కారణంగా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్నారు. తిరిగి రెండు, మూడ్రోజుల్లో పర్యటన ఉంటుందని చెప్పారు. శనివారం పట్టణంలో మంత్రి సభా స్థలాన్ని, ప్రాజెక్టు పైలాన్, బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి కేటీఆర్ నిత్యం ప్రజల్లో ఉంటూ.. భారీ సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపలు ఇలా.. పర్యటిస్తూ ప్రజలకు భరోసానిస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచనా విధానాలు అమలు చేస్తూ వెళ్తున్నారని చెప్పారు. అయితే అనివార్య కారణాలతో మంత్రి కేటీఆర్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారని, దీంతో పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు. రెండు, మూడ్రోజుల్లో తిరిగి నిర్వహించే ప్రగతి నివేదిక సభను విజయవంతం చేయాలని కోరారు. రైతులను, ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులను భారీగా తరలిరావాలని కోరారు. తిరిగి కేటీఆర్ చేతులమీదుగా అచ్చంపేట ఎత్తిపోతలను ప్రారంభించుకుంటామని తెలిపారు. ఓ పక్క క్యాబినెట్లో ఈ లిఫ్ట్ ఆమోదం పొందిన వెంటనే ఇక్కడి ప్రజలు సంబురాలు చేసుకుంటుంటే మరోవైపు ప్రతిపక్షాలు విషం చిమ్మడం మొదలుపెట్టాయని ధ్వజమెత్తారు.
ఇప్పుడు మంత్రి కేటీఆర్ పర్యటన వాయిదా పడిందని తెలిసిన వెంటనే మళ్లీ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టు ఆగిపోతున్నట్లుగా.. వారి వ్యవహారశైలి తయారైందని ధ్వజమెత్తారు. అయితే ఆదివారం సభకు 50-60 వేల మందితో సభ నిర్వహించాలని భావించామని, కానీ మరో రెండ్రోజులు సమయం లభించడంతో అదనంగా మరో 10 వేలకుపైగా జనాన్ని తరలిం చే అవకాశం లభించిందన్నారు. రైతులు, ప్రజలు, శ్రేణులు, అభిమానులు ప్రభుత్వంపై విశ్వాసంతో ఉన్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మంత్రి కేటీఆర్ సభను నిర్వహించి విజయవం తం చేస్తామని స్పష్టం చేశారు. జనసమీకరణకు వాహనాలు లభించడం లేదని, దేవరకొండ, కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్కర్నూల్, ఇతర ప్రాంతాల నుంచి తెప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రగతి నివేదిక సభను పండుగలా.. మరుపురాని విధంగా అట్టహాసంగా నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎత్తిపోతలను పూర్తి చేసి సాగునీటిని పారించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని స్పష్టం చేశారు. అచ్చంపేటలో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ పైలాన్, అనంతరం బహిరంగ సభలో పాల్గొని మంత్రి ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం ఉప్పునుంతలలో 30 పడకల దవాఖాన భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు పర్యటనకు సహకరించాలన్నారు. రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ చై ర్మన్ నర్సింహాగౌడ్, వైస్ చైర్పర్సన్ శైలజా , మాజీ చైర్మన్ తులసీరాం తది తరులున్నారు.