గద్వాల, మార్చి 26 : వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పాఠశాలలకు ఒంటి పూట బడులు నిర్వహిస్తుండగా.. విద్యార్థులు సక్రమంగా వినియోగించుకోకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎండవేడిమి నుంచి సేదతీరేందుకు విద్యార్థులు బావులు, చెరువుల వైపు పరుగులు తీస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా జాగ్రత్త లు తీసుకోకపోవడంతో ఒకరిని చూసి మరొకరు సరదాగా ఈత కొడుతూ నీట మునిగి మృత్యువాత పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు కడుపుకోత తప్పడం లేదు. విద్యార్థులు ఒంటి పూట బడులు ముగిసిన తర్వాత మధ్యాహ్నం ఆటపాటలతో సరదాగా గడపొచ్చనే ఉత్సాహంతో ఎక్కువగా ఈత నేర్చుకోవడం కోసం బావులు, చెరువుల వద్దకు వెళ్తుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులే ఎ క్కువగా ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు. చాలా మంది పిల్లల తల్లిదండ్రులు పొలం పనుల్లో నిమగ్నమై ఉంటారు. దీంతో చెప్పేవారు లేక ఆటలు ఆడటం, అనంతరం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లడం చేస్తుంటారు. వీరికి అవగాహన లేకపోవడం వల్ల ఇష్టారీతిలో ఈత కొడుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో భారీ జలాశయాలు (జూరాల, సుంకేసుల ప్రాజెక్టులు, రిజర్వాయర్లు), చెరువులు, కాల్వలతోపాటు బావుల్లో సైతం ఈత కోసం విద్యార్థులు వెళ్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు.
గతేడాది వేసవి కాలంలో ఒంటి పూట బడులు రావడంతో ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత పడ్డారు. అయిజ మండలంలోని తూంకుంటకు చెందిన రాముడు తన కూతురు వెన్నెలకు ఈత నేర్పించడానికి వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకూతు రు మృతి చెందారు. ఇటిక్యాల మండలానికి చెం దిన శేషన్న అనే బాలుడు గద్వాల మండలం సం గాల చెరువు సమీపంలో గొర్రెలను కాపాడే క్ర మంలో బురద గుంటలో పడి మృతి చెందాడు. గద్వాల మండలం ఈడ్గోనిపల్లికి చెందిన మల్లేశ్ గొర్రెలకు నీరు తాగించేందుకు చెరువు దగ్గరకు వె ళ్లి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు.
ఒంటి పూట బడులు ప్రారంభమైన ఎనిమిది రోజుల్లోనే జిల్లాలో ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. గత శనివారం(మార్చి 16న) అయిజ మండలం మూగోనిపల్లికి చెందిన విద్యార్థి నరేశ్ స్నేహితులతో కలిసి వ్యవసాయ పొ లం సమీపంలో ఉన్న బావిలో ఈతకు వెళ్లాడు. బావిలోకి దూకి మృత్యువాత పడ్డాడు. అది మరువక ముందే బుధవారం(మార్చి19న) మల్దకల్ మండలం ఉలిగేపల్లి గ్రామానికి చెందిన బోయ హుస్సేన్ కొడుకు వీరేశ్(13) మధ్యాహ్నం స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. సాయంత్రం వర కు కుమారుడు ఇంటికి తిరిగి రాకపోవడంతో అ నుమానంతో బావి దగ్గకు వెళ్లి చూడగా.. నీటిలో శవమై కనిపించగా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అదే విధంగా శనివారం(మార్చి 23న) అయిజ మండలం చిన్నతాండ్రపాడు గ్రా మానికి చెందిన దేవేందర్గౌడ్ కుమారుడు భూపతిగౌడ్ ఇంటర్ చదివిన విద్యార్థి గుడికి వెళ్లే క్ర మంలో బావిలో స్నానం చేయడానికి వెళ్లి మృ త్యువాత పడ్డాడు.
ఈత సరదా విషాదం కాకూడదు. తల్లిదండ్రులు పిల్లలను జలాశయాలు, కాల్వలు, చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈత వచ్చిన వారి సంరక్షణలోనే చిన్నారులు ఈత నేర్చుకోవాలి. స్కూల్కు వెళ్లిన పిల్లలు సాయంత్రం వరకు ఇంటికి రాకపోతే వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలి. ఈతకు వెళ్లేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామాల్లో కళాజాత బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపడుతాం.