కొల్లాపూర్, మే 22 : కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కుమ్ములాటలు తప్పడం లేదు. కొల్లాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుల్లో ప్రధానంగా పార్టీ టిక్కెట్ను ఆశిస్తున్న ప్రధానంగా నలుగురు ఆశావహులు తలోదిక్కున కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పార్టీ కార్యాలయాల పేరుతో ఆ నలుగురు వేర్వేరుగా నాలుగు కార్యాలయాలకు కాంగ్రెస్ పార్టీ అని బోర్డులు తాటికాయంత అక్షరాలతో రాసికట్టుకున్నారు. దీంతో పార్టీ శ్రేణులు ఏ నాయకుడి వద్దకు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో కొల్లాపూర్ కాంగ్రెస్లో వర్గపోరుతో హస్తవ్యస్తంగా తయారైంది. త్వరలో రానున్న అసెం బ్లీ టిక్కెట్ తనకంటే.. తనకే అంటూ ఎవరికి వారు భీరాలు పోతూ పార్టీ శ్రేణులను తమ వైపు మళ్లించుకొనేందుకు పడరాని పాటు ్లపడుతున్నారు. ఇక్కడ ఇల్లును చక్కబెట్టుకోనోళ్లు.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఇక్కడ కూడా తామే గెలుస్తామని పగటికల లు కంటున్నారని పలువురు రాజకీయ విశ్లేషకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఆది నుంచి వర్గపోరు..
కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీలో ఆది నుంచి వర్గపోరు అనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం పార్టీ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. నాయకుల మధ్య అంతర్గత వైరుధ్యాలు హెచ్చుమీరడంతో పార్టీ కార్యక్రమాలు సైతం కొంత కాలంగా వేర్వేరుగానే నిర్వహించుకుంటున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో అయోమ యం నెలకొంది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రంగినేని అభిలాష్రావు, టీపీసీసీ సభ్యుడు చింతలపల్లి జగదీశ్వర్రావు అగ్రవర్ణం కాగా, బీసీ నినాదంపై టిక్కెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర కార్యదర్శి తిరుపతమ్మగౌడ్, ఆకునమోని రాముయాదవ్, డాక్టర్ కేతూరి వెంకటేష్ పోటీ పడుతున్నారు. అయితే ఇందులో (పార్టీ అధికారిక కార్యాలయం, రాముయాదవ్) కేతూరి వెంకటేశ్ తప్పా మిగతా నలుగురు చాలాకాలంగా తమ సొంతంగా పార్టీ కార్యాలయాలను తెరుచుకున్నారు. వీరి గ్రూపుల క్యాడర్లో సమీకరణలు సైతం మారుతున్నాయి. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ గెలిచినంత మాత్రనా తెలంగాణలో కూడా విజయకేతనం ఎగురవేస్తాం అని పగటికలలు కంటున్నారే తప్పా.. బీఆర్ఎస్పై గెలువడం అంత సునాయాసం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కర్ణాటకలో బీజేపీ అవలంబించిన నియంతృత్వ విధానాలు, పెచ్చరిల్లిపోయిన అవినీతి కారణంగానే కన్నడీల ప్రజాగ్రహనికి గురై కమలం ఓటమి పాలైందంటున్నారు. కర్ణాటక రాజకీయ పరిస్థితులకు, తెలంగాణ పరిస్థితులను బేరీజు వేసుకోవడం సరికాదని విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల ప్రజలు లబ్ధ్దిపొందేలా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారు. దీంతో ప్రజ ల్లో కారు పార్టీపై ప్రజల్లో సానుకూలంగా ఉందని వారు ఘంటాపదంగా నొక్కి చెబుతున్నారు.
కార్యకర్తల అయోమయం..
కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకుల్లో ఐక్యత కొరవడడంతో ప్రజల్లో పార్టీ గాడితప్పిందన్న ప్రచారానికి బలం చేకూర్చుతుంది. తనకు తప్పా టికెట్ ఎవ్వరికొచ్చినా తాను రెబల్గా పోటీలో ఉంటానని ఓ నాయకుడు బాహాటంగానే ప్రచారం చేసుకుంటుండగా.. తనకు రాజకీయ భవిష్యత్ ఉందని, అధిష్టానం ఎవరికీ టిక్కెట్ ఇచ్చినా పనిచేస్తానంటూ మరో నాయకుడు చెప్పుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. వీరి అనైక్యత కారణంగా త్వరలో హస్తం పార్టీలో ఓ రాజకీయ ఉద్దండుడు చేరనున్నడంతో టిక్కెట్ సదరు నాయకుడికే వస్తుందన్న ప్రచారం లేకపోలేదు. ఇదిలా ఉండగా, కొల్లాపూర్లో కాంగ్రెస్ నాయకుల తీరుతో నాయకులు, కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. వర్గపోరుతో ఎవరికి వారే యమునా తీరే అన్న చం దంగా వ్యవహరిస్తుండడంతో ఎవరికి వైపు ఉండాలో అర్థంకాక అయోమయానికి గురవుతున్నారు.