పెద్దకొత్తపల్లి, మార్చి 7: పెద్దకొత్తపల్లి మండలం జగన్నాధపురం గ్రామంలో గురువారం నుంచి ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ప్రతి ఇంట ఆడపడుచులు, బంధు గణం రాకతో ప్రతి గుమ్మానికి మామిడి తోరణాలతో ఇంటింటా పిండి వంటల గుమగుమలతో పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులంతా ఐకమత్యంతో వీరాంజనేయ స్వామి, సీతారామ లక్ష్మణ విగ్రహాలతోపాటు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను ఆలయంలో ప్రతిష్టించారు. ఈ నేపథ్యంలో ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం వేద పండితుల మంత్రోచరణాల మధ్య ఘనంగా అంకురార్పణ జరిగింది. గణపతి పూజతో ప్రారంభమైన పూజలు, హోమం, అభిషేకాలు, ధ్వజ స్తంభరోహణతో ముగుస్తుంది. శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి.
ఆలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్టకు ముందు అత్యంత కీలక ఘట్టం వాస్తు పూజ, వాస్తు యాగం, యాగశాల ప్రవేశం, చతుస్థానార్చన, అరణీమథనం, అగ్ని ప్రతిష్ట, మూలమంత్ర హోమము, పూర్ణాహుతి, తీర్థ ప్రసాదగోష్టి తదితర కార్యక్రమాలు కనుల పండువగా జరిగాయి. అగ్ని ప్రతిష్ట, హోమంలో అగ్నిజ్వాలలతో దేవతా మూర్తులు ప్రత్యక్షమైన ఆకారంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆధ్యాత్మిక భావనతో తన్మయత్వం చెందారు. ధ్వజ సంభ ప్రతిష్ట అనంతరం ప్రతి ఇంటి నుంచి వారి ఆడపడుచులకు ఒడిబియ్యం పెట్టి సాగనంపాలని వేద పండితులు గ్రామ ప్రజలకు తెలిపారు.
వీరాంజనేయ స్వామి విగ్రహం ప్రతి గ్రామంలో ఉండాలని అత్యంత బలశాలుడైన వీరాంజనేయ స్వామి గ్రామానికి గ్రామంలో ఎలాంటి పిశాచాలు ప్రవేశించకుండా అడ్డుకుంటాడని ఆధ్యాత్మిక చరిత్ర చెబుతున్నట్లు వేద పండితులు వివరించారు.అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట సందర్భంగా పూజా కార్యక్రమాలలో గ్రామ ప్రజలతో పాటు సమీప గ్రామ ప్రజలు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అంతరిస్తున్న మానవ విలువల నేపథ్యంలో ఆధ్యాత్మిక చింతన సత్యం వైపు నడిపిస్తుందని మానవ విలువలను కాపాడుతుందని కుటుంబ బంధవ్యాలను మెరుగుపరుస్తుందని పేద పండితులు వివరించారు. హనుమాన్ చాలీసాను హనుమాన్ చరిత్రను ప్రజల తెలియజేశారు. వేద పండితులు పూజా కార్యక్రమాలతో పాటు వేదమంత్రోచరణలతో రామాయణం హనుమాన్ చరిత్రను భక్తులకు తెలపడంతో భక్తులు ఆధ్యాత్మిక భావోద్వేగానికి లోనయ్యారు.
జై శ్రీరామ్- జై హనుమాన్ నినాదాలతో వేదమంత్రోచ్చారణలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఆదివారం వరకు జరిగే వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలను తిలకించేందుకు వస్తున్న భక్తుల రాకపోకలతో జగన్నాధపురంలో సందడి నెలకొంది. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, యువకులు జాగ్రత్తలు తీసుకున్నారు.