గద్వాల, డిసెంబర్ 16: జోగులాంబ గద్వాల జిల్లాలో వరికోతల జోరు కొనసాగుతున్నది. కొన్ని ప్రాంతాల్లో యంత్రాలతో వరికోతలు కోస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో కూలీలతో కోయిస్తున్నారు. జిల్లాలో ఇటు కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకు పని లభిస్తున్నది. జోగులాంబ గద్వాల జిల్లాలో వానకాలంలో రైతులు సాగుచేసిన వరిపంట ప్రస్తుతం చేతికి రావడంతో రైతులు విక్రయించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లాలో మొత్తం 74 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు జిల్లాలో 50 ధాన్యం కేంద్రాలు ప్రారంభించారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు వానకాలంలో 83,351 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు సాగు చేసిన పంటల ద్వారా దిగుబడి 2.45,873 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. దానికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన వరికి ప్రభుత్వ మద్దతు ధర ఏగ్రేడ్ రకానికి రూ.2060, సాధారణ రకానికి రూ.2040 మద్దతు ధర అందిస్తున్నది. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయంలో తేమశాతం 14నుంచి 17శాతం కంటే తేమ ఎక్కువగా ఉండకుండా తీసుకురావాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటినుంచి నేటివరకు 50 కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి 6,367.920 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి రైతుల ఖాతాల్లో ఇప్పటి వరకు రూ.1,10,70,960 జమ చేశారు.