జడ్చర్లటౌన్, మే 29 : జడ్చర్ల పట్టణంలో ఓ ప్రేమోన్మాది చేతిలో ఉన్నత విద్యావంతురాలు వైష్ణవి దారుణహత్యకు గురికావడం బాధాకరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఇటీవల జడ్చర్లలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వైష్ణవి కుటుంబసభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి పరామర్శించారు. ముందుగా వైష్ణవి చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. వైష్ణవి హత్య ఘటన గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు.
తీవ్ర దుఃఖంలో ఉన్న వైష్ణవి కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ఆడపిల్లలకు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీమాజీ వైస్చైర్మన్ యాదయ్య, పిట్టల మురళి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.