ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను వెల్లడించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,53, 863 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు 15,28,661 మంది, పురుషులు 15,25,132 మందితోపాటు ట్రాన్స్జెండర్లు 69 మంది ఉన్నారు. 18 ఏండ్లు నిండిన వారంతా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో ఐదేండ్లతో పోలిస్తే వారి సంఖ్య 93 వేల వరకు పెరిగింది. వనపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 2,65,622 మంది ఉండగా.. జడ్చర్లలో అత్యల్పంగా 2,12,395 మంది ఓటర్లు ఉన్నారు. ఓటరు నమోదు కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడంతో ఫలితమిచ్చాయి. అలాగే గతానికిమించి పోలింగ్ బూతులు ఏర్పాటయ్యాయి. ఇబ్బందులు తలెత్తకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలపై అవగాహన కల్పించారు. పోలింగ్కు సరిగ్గా 48 రోజుల సమయం ఉండడంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నియమావళిని కలెక్టర్లు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఫ్లయింగ్ స్వాడ్లు, తనిఖీ బృందాలు చెకింగ్ ప్రారంభించాయి. నగదు, మద్యం తరలించకుం డా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాయి.
మహబూబ్నగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎన్నికల షెడ్యుల్ వెలువడ గానే ఎలక్షన్ సందడి ప్రారంభమైంది. నవంబర్ 30న పోలింగ్ జరుగనుండటంతో అధికారులు ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వచ్చే వాహనాలను తనిఖీలు చేసి మద్యం రవాణా, నగదు తీసుకెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ఎన్నికలకు ఇంకా 48 రోజుల సమయం ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, సిబ్బందిని పురమాయించే పనిలో పడ్డారు. ఓటర్ల నమోదు కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడం.. క్షేత్రస్థాయిలో అధికారులు దగ్గరుండి ఓటర్లను నమోదు చేయించడంతో విశేష స్పందన లభించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా లక్ష వరకు కొత్త ఓటర్లను నమోదు చేయించారు. ఓటర్ల నమోదే కాకుండా ఈవీఎంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఓటుపై ఆసక్తి పెరిగింది. ఈసారి చాలామంది యువత, విద్యార్థులు తమ ఓటు హక్కును నమోదు చేసుకున్న వారిలో ఉన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు కాలేజీల వద్ద కూడా ఓటరు అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ఓటర్ల నమోదుకు ఊహించని ఆదరణ లభించింది.
పెరిగిన ఓటర్లు
తాజాగా ఎన్నికల సంఘం ప్రకటించిన జాబితా ప్రకారం 30 లక్షల 53 వేల 863 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 15,25,132 కాగా, మహిళలు 15,28,661, ట్రాన్స్జెండర్లు 69 మంది ఉన్నారు. 2023 ఎన్నికలకు సంబంధించిన తుది జాబితా ఫైనల్ కావడంతో ఎన్నికల కమిషన్ జాబితా ప్రకటించింది. ఐదేండ్లలో పోలిస్తే సుమారు కొత్త ఓటర్ల సంఖ్య 93 వేల వరకు పెరిగింది. 18 ఏండ్లు నిండిన వారంతా ఓటర్లుగా కొత్తగా నమోదు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వనపర్తి నియెజకవర్గంలో అన్ని నియోజకవర్గాలకంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 2,65,622 మంది ఓటర్లున్నారు. జడ్చర్లలో 2,12,395 మంది ఓటర్లు ఉండగా మిగితా నియోజకవర్గాలతో పోలిస్తే తక్కువ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. గత ఎన్నికల్లో చాలాచోట్ల పోలింగ్ బూతుల సమస్య ఏర్పడింది. ఈసారి ప్రజలకు అవసరం ఉన్న ప్రాంతాల్లో ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్కు సరిగ్గా 48 రోజుల సమయం ఉన్నది. ఈమేరకు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి ఎన్నికల నియమావళిని ఆయా పార్టీ ప్రతినిధులకు కలెక్టర్లు వివరించారు. ఫ్లయింగ్ స్వాడ్లు తనిఖీ బృందాలు అప్పుడే చెకింగ్లు ప్రారంభించాయి. భారీగా నగదు పట్టుబడుతుంది. మద్యంపై కూడ నిఘా పెంచారు.
పెరిగిన ఓటర్లు పొలింగ్ కేంద్రాలు
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 13 నియెజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గత ఎన్నికలతో పోలిస్తే భారీగా పెరిగింది. కొత్తగా ఓటేసే వారి సంఖ్య 93 వేలకుపైగానే ఉన్నది. గతంతో ఎన్నడూ లేనంతగా ఓటర్ల నమోదు ప్రక్రియ సాగింది. యువతలో చైతన్యం పెరగడం.. చదువుకున్న వారంత ఓట్లు వేయడానికి ఆసక్తి చూపడంతో గణనీయంగా ఈసారి కొత్త ఓటర్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లో, మండలాలు, జిల్లా కేంద్రాల్లో ఓటర్లను చైతన్యం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇచ్చాయని అంటున్నారు. అంతేకాక గ్రామాల్లో ఈవీఎం ఓటింగ్ మిషన్లపై కూడా పూర్తి స్థాయి అవగాహన కల్పించడంతో ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. కొత్తగా ఓటు వేసేందుకు చాలామంది అసక్తి చూపుతూ ఎన్నికల కమిషన్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తులు కూడ సమర్పించారు. గ్రామాల్లో ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఈవీఎం మిషన్ ఎలా పనిచేస్తుందో చూపించారు. డమ్మీ ఈవీఎం మిషన్ను ఉంచి బటన్ ప్రెస్ చేయగానే వీవీప్యాట్లో కనిపించే గుర్తును చూపెట్టారు. అనేక అవగాన కార్యక్రమాలు చేపట్టడంతో ఈసారి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
రూ.50 వేలకంటే మించిన నగదుపై నిఘా..
ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా చెక్పోస్టుల వద్ద భారీగా నగదు పట్టుబడుతుంది. ఈ నగదును ట్రెజరీకి తరలిస్తున్నారు. వనపర్తి జిల్లాలో తనిఖీల్లో భాగంగా రూ.14లక్షల 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 150 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. మక్తల్ మండలం కాచ్వార్ వద్ద వాహనాల తనిఖీల్లో రూ.లక్షా 40 వేలు పట్టుబడింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండటంతో అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ ట్టినిఘా ఏర్పాటు చేశారు. ఇటీవల కృష్ణా చెక్పోస్టు వద్ద కర్ణాటక నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకున్నారు. మద్యం అక్రమ రవాణా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటిపై నిఘా ఉంచామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దులో నిఘా ఉంచామని.. అయితే అలంపూర్ బ్రిడ్జిపై నుంచి మద్యం తరలిస్తున్నారనే సమాచారం ఉండటంతో అక్కడ కూడా నిఘా పెంచామన్నారు.
రాతలను తుడుస్తున్న సిబ్బంది..
ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేయడానికి ఆయా పార్టీల నాయకులు భారీగా వాల్రైటింగ్ చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో రావడంతో ఈ రాతలన్నింటినీ తుడిచి వేస్తున్నారు. వేల రుపాయలు ఖర్చు చేసి తమ రాయించుకున్న వాటిని సిబ్బంది తొలగిస్తుండటంతో నేతలు మదనపడ్తున్నారు. చాలామంది టికెట్లు కోసం అధిష్టానం దృష్టిలో పడేందుకు వేలకు వేలు ఖర్చుచేసి గోడల మీద వాల్రైటింగ్ చేయించారు. చివరకు ఎన్నికల నియమావళి రావడంతో ఈ రాతలన్నింటినీ చెరిపేస్తున్నారు. గ్రామాల్లో జెండాలు, ముఖ్య నేతల విగ్రహాలకు కూడా మాస్క్లు వేస్తున్నారు. ఎవరైనా అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉండటంతో గ్రామాల్లో, జిల్లా కేంద్రాల్లో చాలామంది ప్రత్యర్థులపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ వస్తున్న ఫిర్యాదులపై కలెక్టర్లు స్పందించి వెంటనే విచారణ జరిపిస్తున్నారు. ఫిర్యాదులు నిజమైతే చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంపైన ఎన్నికల వేడి పెరుగుతుండటంతో గ్రామాల్లో పార్టీలపై చర్చలు మొదలయ్యాయి. ఫలానా వ్యక్తి గెలుస్తాడని.. ఓట్లు పడ్తాయని ప్రచారం జరుగుతుంది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాతో ఉన్నారు.