జడ్చర్లటౌన్, ఏప్రిల్ 10 : జడ్చర్ల పట్టణంలోని సంతోష్నగర్లో నివాసముంటున్న ఓ మహిళ నల్లమల్ల అడవుల్లో హత్యకు గురైన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను ప్రియుడు హత్యకు పాల్పడ్డాడు. జడ్చర్ల పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్చర్ల సీఐ రమేశ్బాబు కథనం ప్రకారం.. తిమ్మాజిపేట మండలం గొరిట గ్రామానికి చెందిన ఆరేళ్ల లక్ష్మి(35)కి పదేండ్ల కిందట దేవరకద్ర మండలం డోకూర్కు చెందిన మన్యంతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. మూడేండ్లుగా భర్తతో గొడవపడి లక్ష్మి పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత ఏడాదికాలంగా జడ్చర్లలోని సంతోష్నగర్కాలనీలో ఓ అద్దె ఇంట్లో నివాసిస్తున్నది. ఇక్కడే ఆంజనేయస్వామి ఆలయంలో స్వీపర్గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నది. ఆమెకు అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చెన్నయ్యతో రెండేండ్లుగా వివాహేతర సంబంధం ఏర్పడగా, ఏడాది కిందట చెన్నయ్యకు మరో మహిళతో వివాహమైంది.
ఈ క్రమంలో పాతపరిచయంతో లక్ష్మితో చెన్నయ్య వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఈ నేపథ్యంలో లక్ష్మి గర్భిణి కావడంతో చెన్నయ్యను పెండ్లి చేసుకోవాలని, అలాగే రెండు ఎకరాల పొలం ఇవ్వాలని చెన్నయ్యపై లక్ష్మి ఒత్తిడి తెచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా అంతమొందించాలనే దురుద్దేశంతో ఫిబ్రవరి 28న శ్రీశైలం వెళ్లి పెండ్లి చేసుకుందామని లక్ష్మిని నమ్మించిన చెన్నయ్య ఆమెను బైక్పై తీసుకెళ్లి పాలెంలో రాత్రి ఓ ఆలయంలో భస చేశారు. మరుసటి రోజు మార్చి1న మాయమాటలతో ఆమెను అమ్రాబాద్ సమీపంలోని నల్లమల్ల అడవుల్లోకి తీసుకెళ్లి కట్టెతో దాడి చేసి, గొంతు నులిపి హత్య చేశాడు. అనంతరం ఎలాంటి ఆధారాలు దొరక్కకుండా మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఈక్రమంలో తన కూమార్తె కనిపించడంలేదని, చెన్నయ్యపై అనుమానం ఉందని పేర్కొంటూ మృతురాలి తల్లి చెన్నమ్మ మార్చి25న జడ్చర్ల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా ఉన్న చెన్నయ్యను సోమవారం స్థానిక వంశీ దవాఖాన వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు చెన్నయ్య హత్య చేసిన వివరాలను వెల్లడించాడు. పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి బైక్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ రమేశ్బాబు తెలిపారు. మహిళ హత్య కేసులో ఉన్న నిందితుడు 2010లో తిమ్మాజిపేట పోలీసుస్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో బాలిక(5)పై అత్యాచారం చేసిన కేసులో మూడేండ్లు జైలుశిక్ష అనుభవించి బయటకు వచ్చాడని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు లెనిన్, ఖాదర్, వెంకటేశ్ పాల్గొన్నారు.