బిజినేపల్లి, జనవరి 7 : మాజీ మంత్రి నాగం జ నార్దన్రెడ్డికి చుక్కెదురైంది. మండలంలోని శాయిన్పల్లి గ్రామ శివారులో నిర్మించనున్న మార్కండేయ రిజర్వాయర్ ప్రాంతానికి సందర్శించడానికి శనివారం తన అనుచరులతో కలిసి నాగం చేరుకున్నారు. నాగం వస్తున్నాడన్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు రిజర్వాయర్ నిర్మాణానికి వేసిన పైలాన్ వద్దకు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగిన నీవు నియోజకవర్గానికి చేసింది ఏమిటని అక్కడికి వచ్చిన నాగంను ప్రశ్నించారు. మార్కండేయ రిజర్వాయర్ పనులు ప్రారంభం కాకముందే ఏం చూడడానికి ఇక్కడికి వచ్చావని నిలదీశారు. ఎలాంటి అభివృద్ధి చేయకపోగా.. మంజూరైన మెడికల్ కళాశాలను వేరే ప్రాంతానికి అమ్ముకున్నావని విమర్శించారు.
మండలంలో ఎంజీకేఎల్ఐ కాల్వ నుంచి మిగిలిపోయిన గ్రామాలైన గంగారం, శాయిన్పల్లి, పోలేపల్లి, మమ్మాయిపల్లి, లట్టుపల్లి తదితర గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మార్కండేయ రిజర్వాయర్ను మంజూరు చేయించారని తెలిపారు. రైతుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తుంటే ఓర్వలేక నాగం సందర్శనల పేరుతో ఆయా గ్రామాల ప్రజల్లో అపోహాలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి తోపులాట చోటు చేసుకున్నది. దీంతో ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొన్నది. అనంతరం ఇరుపార్టీల నాయకులు బిజినేపల్లి పోలీస్స్టేషన్కు చేరుకొని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మోహన్కుమార్ తెలిపారు.