నాగర్కర్నూల్, మార్చి 15 : గుడిపల్లి రిజర్వాయర్ను నింపి పంట పొలాలకు సాగునీటిని అందించి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర నేత నాగం జనార్దన్రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి గుడిపల్లి రిజర్వాయర్ను సందర్శించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టులోని ఐదు మోటర్లకు గానూ కేవలం మూడు మోటర్లే పనిచేస్తున్నాయని, వాటి ద్వారా నీటిని విడుదల చేయకుండా అధికారులు, ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో సరైన నీరందక నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.
ప్రస్తుతం సాగు చేసిన పంటలకు రెగ్యులర్గా రెండు మోటర్ల నడిపి గుడిపల్లి రిజర్వాయర్ను నింపి రైతుల పంటలకు నీరందిస్తే సరిపోయేదని, కానీ అధికారులు, ప్రభు త్వం పట్టించుకోకపోవడం పంటలు కోతకు వచ్చే దశలో ఎండుముఖం పట్టి రైతు నష్టపోయే ప్రమా దం ఉందన్నారు. డీ-26 కాల్వ పొడవునా ఉన్నపంట పొలాలు నీరందక వాడుపట్టాయని, మొక్కజొన్నకు గింజపట్టే సమయంలో ఎండిపోయాయన్నారు. వనపర్తి ప్రాంతానికి వెళ్తే ఎంతో సంతోషంగా ఉందని, అదే మన ప్రాంతానికి వచ్చే సరికి ఇంజినీర్లు, రాజకీయ నాయకులు కేఎల్ఐని భ్రష్టు పట్టించారన్నారు. నాడు నేడు అధికారంలో మంత్రిగా ఉ న్నప్పుడు గుడిపల్లి వద్ద కేఎల్ఐ ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేశానని గుర్తు చేశారు.
ఇక్కడి రైతుల ఇబ్బందులను గుర్తించి ప్రాజెక్టు చేపడితే గుడిపల్లి గట్టును నింపకుండా నిర్లక్ష్యం చేస్తూ నేడు పంటలు ఎండిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. కనీసం తరచూ రెండు మోటర్లు నడిపిస్తే పంట పొలాలు ఎండిపోయేవి కాదని, అలా కాకుండా పూర్తిగా నిర్ల క్ష్యం చేయడం వల్ల పంటలన్నీ ఎండుతున్నాయన్నా రు. సాగునీటి శాఖ మంత్రి వచ్చి చుట్టపుచూపుగా వచ్చిపోతాడని, ఇక్కడి రైతుల గురించి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, ఎంపీ కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కట్ట పొడవునా ఏపుగా పెరిగిన ముళ్ల పొదలవల్ల ప్రమాదం పొంచి ఉందని, ప్రాజెక్టు వద్దకు రావడానికి కూడా రోడ్డు సక్రమంగా లేదని , మెయింటనెన్స్ ఘోరంగా ఉందని, ప్రజాప్రతినిధులకు పరిజ్ఞానం లేకుండా పోయిందన్నారు. పెండింగ్లో ఉన్న 3, 5 మోటర్లను సైతం నడిచేలా చర్యలు తీసుకొని కాల్వ వెడల్పును పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వాయర్ మధ్యలో ఉన్న గుట్టను తొలగిస్తే మరో టీఎంసీ నీటిని నిల్వ ఉంచుకునే అవకాశం ఉందన్నారు.
అవేవీ పట్టించుకోకుండా ఉన్న కట్టను సైతం సక్రమంగా చూసుకోలేకపోతున్నారని, ఇదేం పాలన అంటూ ప్రశ్నించారు. 32 క్యూసెక్కుల నీరు పారేందుకు తొలుత నిర్మాణం చేపట్టామని, అదే 32క్యూసెక్కులకు మూడు మోటర్లు సరిపోతుందని, పెండింగ్లో ఉన్న మరో రెండు మోటర్లను బాగు చేసి దాదాపు 4500 క్యూసెక్కుల నీటిని ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు అనుగుణంగా కాల్వలను వెడల్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం యాసంగిలో రిజర్వాయర్ నీటిని నమ్ముకొని రైతులు మొక్కజొన్న, వరి, వేరుశనగ పంటలు సాగు చేశారన్నారు. సరైన నీరందక ఎండుదశకు చేరుకున్నాయని, ఇప్పటికైనా రైతుల పంటలు చేతికి వచ్చే సమయంలో సాగునీటికోసం ఇబ్బందులు పెట్టకుండా వారికి నష్టం జరగకుండా నీరందించి పంట పొలాలను కాపాడాలని డిమాండ్ చేశారు. నాగం వెంట రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు నాగం శశిధర్రెడ్డి, నా యకులు అర్థం రవి, బాలగౌడ్, కౌన్సిలర్ అర్జున య్య, వెంకటేశ్, సత్యం, నాయకులు ఉన్నారు.