గద్వాల జెడ్పీ సెంటర్, ఆగస్టు 25 : తెలంగాణ ప్రజలకు ఆస్తి నమోదు ప్రక్రియను మరింత సులభతరం, చేరువ చేసేందుకు ప్రభుత్వం 2020 అక్టోబర్లో ధరణి పోర్టల్ను ప్రారంభించింది. ఆస్తి రిజిస్ట్రేషన్తోపాటు ల్యాండ్ మ్యూటేషన్, ల్యాండ్ రికార్డుల సెర్చ్, ఇతర భూ సంబంధిత సేవలకు ధరణి పోర్టల్ గమ్యస్థానంగా మారింది. దీంతో దళారీ వ్యవస్థకు చెక్ పడగా.. పారదర్శకత మొదలై లంచాలు, మోసాలు తగ్గాయి. ధరణి పోర్టల్తో క్షణాల్లో రిజిస్ట్రేషన్ అవుతుండడంతో రైతుల మోములో సంతోషం నెలకొన్నది.
ధరణిలో అందుబాటులో ఉన్న సేవలు ఇవి..
స్లాట్ బుకింగ్, ఎన్ఆర్ఐ పోర్టల్, మ్యుటేషన్ సేవలు, పాస్బుక్ లేకుండా నాలాకు దరఖాస్తు, లీజుకు దరఖాస్తు, అమ్మకం నమోదు, విభజన, వారసత్వానికి దరఖాస్తులు, తనఖా నమోదు, జీపీఏ నమోదు, స్లాట్ రద్దు, రీ షెడ్యూలింగ్, భూ వివరాల పరిశీలన, నిషేధిత భూమిని వెతకడం మొదలైన అంశాలుంటాయి.
టీ-యాప్ ఫోలియో
కుల, ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, స్థానికత గుర్తింపు, ఆర్ఓఆర్, పహాణీలు, రిజర్వేషన్ బుకింగ్, ప్రీమియం చెల్లింపులు, దర్శనం టికెట్ బుకింగ్, వ్యవసాయ, రవాణా శాఖ, ఉద్యోగులు, కార్మికుల కోసం సేవలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష రుసుం చెల్లించవచ్చు. పెన్షన్ లైఫ్ అథెంటికేషన్, పోలీస్, ఆర్టీఏ, ఆధార్ స్లాట్ బుకింగ్, పోస్ట్పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జ్, ల్యాండ్లైన్, ఇంటర్నెట్ బిల్లు చెల్లింపు, డీటీహెచ్, డేటా కార్డు రీచార్జ్ చేసుకోవచ్చు.
చరవాణిలోనే వ్యక్తిగత ఆరోగ్య వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా రూపొందించిన యాప్ టీ-డయాగ్నొస్టిక్. ఇందులో వ్యక్తిగత ఆరోగ్య వివరాలు తెలుసుకోవచ్చు. వైద్య పరీక్షల వివరాలు, రిపోర్టులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దగ్గరలోని ప్రభుత్వ దవాఖాన వివరాలు, జరుగుతున్న వైద్య పరీక్షల స్టేటస్ను తెలుసుకోవడం, సేవల అనంతరం అభిప్రాయాన్ని నమోదు చేయడం, వైద్యసేవల్లో అసౌకర్యం కలిగితే ఫిర్యాదు చేయడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.
ఆర్టీఏ ఎం-వ్యాలెట్
ఈ యాప్తో మన డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన వివరాలన్నీ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు. లైసెన్స్, ఆర్సీ ఇంట్లోనే మర్చిపోయినా భయపడాల్సిన పని లేదు. పోలీసులు తనిఖీ నిర్వహించినప్పుడు ఈ యాప్లోని వివరాలు చూపిస్తే సరిపోతుంది. మొదట తమ చరవాణి నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకొని సంబంధిత సేవలు పొందవచ్చు.