ఊట్కూర్ : ఖరీఫ్ సీజన్లో జింకల ( Deers ) బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి పంటలను రక్షించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (AIUKS) డిమాండ్ చేసింది. సోమవారం ఉట్కూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టి తహసీల్దార్ అశోక్ కుమార్కు వినతిపత్రం ( Farmers Petition ) అందజేశారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు ఎల్కోటి చెన్నప్ప, సి. అంజప్ప మాట్లాడుతూ పెద్దపొర్ల, కొల్లూరు, మల్లేపల్లి, ఎరగట్పల్లి గ్రామాల్లో జింకల మందలు పత్తి, కంది పంటల మొలకలను మేస్తూ రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులు రాత్రింబవళ్లు పొలాల వద్ద కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించాలని, రైతు భరోసా, వరి బకాయిలు, బోనస్ వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు సలీమ్, చిన్నబాలు, బాలకృష్ణ, నర్సింలు, రమేష్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.