గట్టు, సెప్టెంబర్ 19 : బొలేరో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే కాల్వలోకి దూసుకుపోగా డ్రైవర్తోపాటు కర్ణాటక కూలీలు సురక్షితంగా బయటపడిన ఘటన గట్టు-మాచర్ల మధ్యలో నెట్టంపాడు కాల్వ వద్ద మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. ఇడుపునూర్ సమీపంలోని మిడగలదిన్నె నుంచి కూలీలు కూలీ పనులు చేసుకోవడానికి మల్దకల్ మండలానికి బయలుదేరారు. ఈ సమయంలో గట్టు-మాచర్ల మధ్య లో ఉన్న నెట్టంపాడు కాల్వ సమీపంలో వాహనం వెళ్తుండగా వాహనం కింది భాగం నుంచి శబ్దం వచ్చింది.
ఈ సమయంలో డ్రైవర్ హనుమంతు తన పక్కన కూర్చున్న కూలీని బ్రేక్ మీద కాలు ఉంచని సూచించి బొలేరో వెనుకవైపుకు వెళ్లి ఇంజిన్ కింది భాగం పరిశీలించడానికి ఉపక్రమించాడు. ఈ సమయంలో కూలీ అకస్మాత్తుగా బ్రేక్ను వదలడంతో వాహనం ఒక్కసారిగా కాల్వలోకి దూసుకుపోయింది. ఈ క్రమంలో ఒక కూలీ బొలేరో నుంచి దూక గా, మిగతా అందరూ కూలీలు మాత్రం వాహనంలో ఉండిపోయారు. కాల్వలో పడిన ఆటో నుంచి కూలీలు ఒక్కొక్కరుగా నీటి ప్రవాహం నుంచి బయటకు వచ్చి ప్రమాదం తప్పించుకున్నారు. కాగా ప్రమాదం నుంచి తప్పించుకున్న కూలీలకు ఎలాంటి గాయాలు కాలేదు.