కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 15 : పాలమూరు ప్రజల గోస తీర్చే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కంట్రోల్ రూం, కంట్రోల్ ప్యానల్స్, ముఖ్యమంత్రి ప్రారంభించే పీఆర్ఎల్ఐ పైలాన్ను బంతిపూలతో అలంకరించారు.
కొల్లాపూర్ నుంచి అంజనగిరి రిజర్వాయర్ వరకు దారి పొడవునా సీఎం కేసీఆర్కు స్వాగత హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. సీఎం కంట్రోల్ రూంలో స్వీచ్ ఆన్ చేసిన అంజనగిరి రిజర్వాయర్లోకి నీళ్లు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన డెలివరీ సిస్టర్న్ వద్ద కృష్ణాజలాలకు పూజలు చేస్తారు. సప్తనదుల సంగమం నుంచి వచ్చే పవిత్ర జలాలను 1008 కలశాల్లో నింపి హైదరాబాద్, జోగుళాంబ శక్తిపీఠం, సింగోటం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పండితులు కలశపూజ చేస్తారు. డెలివరీ సిస్టర్న్ వద్ద 250మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.