ఎక్కడో విసిరిపారేసినట్టు ఉండే తండాలు.. అభివృద్ధి మచ్చుకైనా కనిపించని గిరిజన గూడేలు.. కనీస వసతులు లేని దౌర్భాగ్య పరిస్థితులు.. ఎన్నో ఏండ్లుగా అనుభవించిన దుస్థితికి సీఎం కేసీఆర్ విముక్తి కల్పించారు. 500కు పైగా జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చారు. స్వయం పాలనతో గిరిపుత్రుల జీవితాల్లో పెనుమార్పు వచ్చింది. ఈ క్రమంలో పాలనను మరింత ఆత్మగౌరవంగా మార్చేందుకు అద్దె భవనాల్లో కొనసాగుతున్న గిరిజన పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఒక్కో పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున ఉమ్మడి జిల్లాలో 152 భవనాలకు రూ.30.40 కోట్లు విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
వనపర్తి/గద్వాల/నాగర్కర్నూల్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): దళిత, గిరిజనుల ఆత్మగౌరవం, అభివృద్ధి నినాదంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఇప్పటికే వివిధ బీసీకులాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. దళితులకు దళితబంధుతో రూ.10లక్షల ఆర్థికసాయం కూడా చేపడుతున్నారు. తెలంగాణ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారు. 125అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో గిరిజనులకు సైతం గిరిజన బంధు పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదిలా ఉండగా గిరిజనుల ఆత్మగౌరవం కోసం జనాభా ప్రకారంగా గిరిజన తండాలను పంచాయతీలుగా రూపాందించారు. ఈ క్రమంలో తండాల్లో ‘ఆప్నే తండామే.. అప్ నే రాజ్’ పేరుతో గిరిజనులు పాలకులుగా మారారు.
అలాంటి పాలకులు కొన్నేండ్లుగా పంచాయతీ నిర్వహణకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ గిరిజన పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికోసం ఉమ్మడి పాలమూరులో 152 గిరిజన గ్రామ పంచాయతీ భవనాలకు ఒక్కోదానికి రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. దీనిపై ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి పాలమూరులోని పంచాయతీలకు రూ.30కోట్ల నిధులు విడుదల కానున్నాయి. ఈ నిధులతో పంచాయతీ భవనాలు సకల వసతులతో నిర్మాణం కానున్నాయి. ప్రస్తుతం అద్దె గదుల్లో, శిథిలమైన ఇండ్లల్లో, ఇరుకు ఇండ్లల్లో, అరకొర వసతుల మధ్య నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నది.
పల్లె ప్రగతితో ఏటా రెండుసార్లు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నది. ప్రతి పంచాయతీకి ట్రాక్టర్నూ ఇచ్చింది. పారిశుధ్య సిబ్బంది అజమాయిషీ, పనులు ఎక్కువగా ఉండటంతో రికార్డుల నిర్వహణలాంటి పనులు పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. కాగా, అద్దె భవనాల్లోని పంచాయతీలతో ఈ పనులు నిర్వహించడం సర్పంచ్, కార్యదర్శులకు కష్టసాధ్యంగా మారింది. పంచాయతీ సమావేశాల నిర్వహణ సైతం చేపట్టలేకపోతున్నారు. పంచాయతీల పరిపాలన, పనులు ఎక్కువ, భవనం తక్కువ అన్నట్లుగా మారింది. ఈ పరిస్థితులను గుర్తించిన సీఎం కేసీఆర్ గిరిజన పంచాయతీలకు పక్కా భవనాల నిర్మాణానికి ఆదేశించారు. ఇలా విడుదలయ్యే నిధులతో ఆధునిక భవనం, ఖాళీ స్థలం, ప్రహరీ, రికార్డులను భద్రపర్చడం, సర్పంచ్, కార్యదర్శులు, సమావేశాల నిర్వహణకు ప్రత్యేక గదులుతదితర వసతులతో భవనాలు నిర్మాణం కానున్నాయి. నాగర్కర్నూల్లో అత్యధికంగా 70పంచాయతీలకు నిధులు మంజూరు కాగా, జోగుళాంబ గద్వాలలో అత్యల్పంగా కేవలం రెండు తండాలకు(పూజారితండా, తూర్పుతండా), నారాయణపేలో మూడు తండాలకు(దామరగిద్ద తండా, జాదవరావుపల్లితండా, తిమ్మారెడ్డిపల్లితండా) నిధులు మంజూరయ్యాయి. మొత్తం మీద పంచాయతీలుగా మారిన గిరిజన తండాలకు నూతన హంగులతో కూడిన భవనాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 152తండాల్లో నూతన పంచాయతీ భవనాల నిర్మాణాలకు ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో 57, నాగర్కర్నూల్ జిల్లాలో 70, వనపర్తి జిల్లాలో 20, జోగుళాంబగద్వాల జిల్లాలో 2, నారాయణపేట జిల్లాలో 3 శాశ్వత భవనాల నిర్మాణాలు త్వరలో ప్రారంభంకానున్నాయి.
మన తండాలో.. మన రాజ్యం అన్నది గిరిజనుల డిమాండ్. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో వారి డిమాండ్ను నిజం చేశారు. తండాలన్నీ గ్రామ పంచాయతీలుగా మార్చారు. ఎవరి తండాలను వారు అభివృద్ధి చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే నూతన పంచాయతీలకు బీటీరోడ్లు, గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజలు, పంచాయతీలకు పక్కా పంచాయతీ భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. వనపర్తి జిల్లాలో 20భవనాలకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కో పంచాయతీకి రూ.20లక్షలు విడుదల చేశారు.
– నిరంజన్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల అభివృద్ధి కనబడుతుంది. స్వరాష్ట్ర పాలనలో తండాల అభ్యున్నతికి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు నూతన భవనాల నిర్మాణాలకునిధులు మంజూరు చేయడం హర్షించదగ్గ విషయం. గిరిజనులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం.
– శాంతి, కర్నెతండా, ఖిల్లాఘణపురం
సీఎం కేసీఆర్ తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించడంతోపాటు పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.20లక్షలు మంజూరు చేయడం హర్షణీయం. ఈ నిధులతో మా గ్రామంలో మంచి భవనం నిర్మాణమవుతుంది. గత ప్రభుత్వంలో గిరిజనులను పట్టించుకున్న పాపానపోలేదు. మా ప్రాంత గిరిజనులం కేసీఆర్కు అండగా ఉంటాం.
– చంద్రకళ, నాచారంపేటతండా, కొత్తకోట
గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజనులే పాలకులుగా ఉండడం, తండాల అభివృద్ధికి నిధులు మంజూరు హర్షణీయం. గతంలో గ్రామ పంచాయతీకి సొంత భవనం లేదనే బాధ ఉండేది. గిరిజనుల కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ నూతన భవనాలు నిర్మించడానికి నిధులు విడుదల చేస్తూ తీసుకున్న నిర్ణయం సంతోషకరం.
– జమున, సర్పంచ్, పూజారితండా
నాగర్కర్నూల్ జిల్లాలో 70గిరిజన పంచాయతీలకు ఒక్కో భవనానికి రూ.20లక్షల చొప్పున రూ.14కోట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఇటీవలే జీవో విడుదల చేసింది. త్వరలో స్థలాలు సేకరించి, ఎస్టిమేషన్లు వేసి కలెక్టర్ ద్వారా పనులకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసే చర్యలు తీసుకుంటాం. ఈ నిధులతో అన్ని వసతులతో పంచాయతీ భవనాల నిర్మాణం జరుగుతుంది.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్ జిల్లా