ఉండవెల్లి, జూన్ 20 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 22 తరగతి గదులతో నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, జెడ్పీ చైర్పర్సన్ మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ.. తొమ్మిదేండ్ల కాలంలో విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులను తీసుకొచ్చామని తెలిపారు.
పేదలకు నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా నూతన భవనాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నూతన భవనం కోసం రూ.2కోట్ల 31లక్షలు మంజూరయ్యాయని వెల్లడించారు. కలుగోట్లలోని ప్రాథమికోన్నత పాఠశాలలో మరమ్మతులు చేసిన పాఠశాల భవనాన్ని వారు ప్రారంభించారు.
అనంతరం పదో తరగతి పరీక్షల్లో జిల్లా ప్రథమ స్థానం సాధించిన సానియా, మదియాను వారు సన్మానించి అభినందించారు. అంతకుముందు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో జాతీయ జెండాను ఎగురవేశారు. స్థానిక కుర్వసంఘం నాయకులు ఏర్పాటు చేసిన బీరప్ప విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ ఆంజనేయులు, ఎంపీపీ బీసమ్మ, జెడ్పీటీసీ రాములమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, ఎంపీటీసీలు రాజు, సుంకన్న, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణ, ఎంపీడీవో ఆంజనేయరెడ్డితోపాటు తదితరులు పాల్గొన్నారు.