అచ్చంపేట, ఏప్రిల్ 23 : సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని.. అందుకు ప్రభుత్వానికి వరుసగా వస్తున్న కేంద్ర అవార్డులే నిదర్శనమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో పట్టణ బీఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. ఆయా వార్డుల నుంచి ప్రజలు సంబురంగా తరలిరాగా గువ్వల మాట్లాడారు. 70 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన, తెలంగాణ ప్రభుత్వం ఈ 9 ఏండ్లలో చేసిన అభివృద్ధి తేడాను గమనించాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలోని ప్రతి పల్లె, తండా, గూడెం అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్తున్నాయన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణ సత్తా చాటిందన్నారు.
46 అవార్డుల్లో 13 ఆవార్డులను తెలంగాణ ప్రభుత్వమే దక్కించుకున్నదని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఈ అవార్డులే ఉదాహరణ అని అన్నారు. సీఎం కేసీఆర్ ఏది చేసినా ఎంతో ఆలోచించి అమలు చేస్తారన్నారు. 9 ఏండ్లలోనే తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి సాధిస్తే.. తెలంగాణ రాక ముందు 70 ఏండ్ల కాలం ఎందుకు వెనుక బడ్డామని ప్రశ్నించారు. ఈ దగాకోరు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం ప్రభుత్వ సంస్థలను ఆధీనంలో పెట్టుకొని సీఐడీ, సీబీఐ సంస్థలను ఉసిగొల్పి రాష్ర్టాలను బెదిరిస్తూ.. నీచ సంస్కృతికి పాల్పడుతున్నదని దుయ్యబట్టారు. కేంద్రానికి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ పురుడు పోసుకున్నదని.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో పెను మార్పులు సంభావిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రణాళికలు ఎవరికీ అంతుపట్టవన్నారు.
దేశ ప్రజలు కూడా కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని వివరించారు. నిరంతర విద్యుత్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అందించాలని సూచించారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఎందుకు సాధ్యమవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యేడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ప్రకటించి ఇప్పటివరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చటగా మూడోసారి తెలంగాణలో గులాబీ జెండా ఎగురుతుందని జోస్యం చెప్పారు. అచ్చంపేటలో ఈసారి 50 వేల మెజార్టీతో గెలుస్తామని.. బీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గ ప్రజలు నిండుగా దీవిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని.. ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
కార్యకర్తలు మరింత పట్టుదల, సమన్వయంతో పనిచేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. 25న అన్ని గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేసి నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమ్మేళనానికి వలపట్ల నుంచి అధికసంఖ్యలో తరలిరావడంతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వార్డు అభివృద్ధికి రూ.10లక్షలు ప్రకటించారు. అనంతరం జీబీఆర్ ట్రస్ట్ చైర్పర్సన్ గువ్వల అమల మాట్లాడుతూ అచ్చంపేట ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వచ్చామన్నారు.
తాము బతికున్నంత కాలం అచ్చంపేట అభివృద్ధి కోసమే పనిచేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులు అందరికీ భోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, వైస్చైర్మన్ శైలజా విష్ణువర్ధన్రెడ్డి, మాజీ చైర్మన్ తులసీరాం, మార్కెట్కమిటీ చైర్పర్సన్ అరుణ, పట్టణ అధ్యక్షుడు పులిజాల రమేశ్, కౌన్సిలర్లు నిర్మలా బాలరాజు, అంతటి శివ, గోపిశెట్టి శివ, మన్నుపటేల్, రమేశ్రావు, గడ్డం రమేశ్, శ్రీను, సోమ్లానాయక్, కుతుబుద్దీన్, నాయకులు పర్వతాలు, శ్రీధర్, నిజాముద్దీన్, బాలరాజు, శ్రీను, ప్రజలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.